ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం- 11 గంటల తర్వాత తొలి ఫలితాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంతకుముందే నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రత మధ్య ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇది పూర్తి కాగానే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. పలు జిల్లాల్లో స్ధానికంగా పోలైన ఓట్ల ఆధారంగా ఉదయం పదిన్నర తర్వాత తొలి ఫలితాలు రావొచ్చని భావిస్తున్నారు. పూర్తి ఫలితాలు వచ్చే సరికి రాత్రి 8 గంటలవుతుందని అంచనా వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిస్ధితుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం భారీ భద్రత ఏర్పాటు చేసింది. జనాలు గుమికూడకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే కౌటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.
కౌంటింగ్ ప్రక్రియను మొత్తం వీడియో, ఫొటోలు తీయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల రికార్డుగా దీన్ని భద్రపరచనున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాపటు చేయాలని ఎస్ఇసి ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 8 గంటల లోపు కౌంటింగ్ పూర్తి చేసేట్లుగా చూడాలని ఎస్ఇసి అధికారులకు సూచించింది.