ఏపీ మున్సిపల్ ఫలితాలు : పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ హవా-ప్రత్యర్ధులకు అందనంతగా
ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ముందుగా కౌంటింగ్ చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ప్రత్యర్ధులకు అందనంత ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్ధానాల్లో టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు ఉన్నాయి.
గంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలైన మొత్తం 64 పోస్టల్ ఓట్లలో వైసీపీకి 27, టీడీపీ 19, బీజేపీ 6, కాంగ్రెస్ 1, జనసేన 5, సీపీఎం 1 దక్కాయి. ఐదు ఓట్లు చెల్లలేదు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ 104, టీడీపీ 31, బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్కు ఒక ఓటు వచ్చాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోలో 7 వార్డులకు 20 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే.. ఇందులో 16 వైసీపీకి దక్కాయి. బీజేపీకి 3, టీడీపీకి ఓ ఓటు దక్కింది. కృష్ణాజిల్లా నందిగామలో పోలైన 28 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీకి 20 ఓట్లు వచ్చాయి.
మిగతా జిల్లాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ భారీ ఆధిక్యం సాధిస్తోంది. టీడీపీ, జనసేనతో పాటు ఇతర పార్టీలు కూడా అక్కడక్కడా ప్రభావం చూపుతున్నా వైసీపీ కంటే అందనంత దూరంలో ఉన్నాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభ కాకపోవడంతో తొలి ఫలితాల రాక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.