ఏపీలోని ఈ జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు...
మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ని ముంచేసింది. తీరం దాటిన తర్వాత తుఫాన్ తెలంగాణ మీదుగా పయనించే క్రమంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సమీపంలో ఉంది. తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడా వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
నేడు కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల ప్రాంతాలతో పాటు రాయలసీమలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి : ఒకవైపు, తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గనేలేదు. మరోవైపు చలి వాతావరణం పెరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ మంచు కారణంగా ఉదయం 8 గంటల వరకు స్థానికులు రోడ్డుపైకి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచు ప్రభావంతో ఎదురెదురుగా వచ్చే వాహానాలు కనపడక, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎనిమిది అయినా, లైట్లు వేసుకుని రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు రైతులు కూడా వ్యవసాయ పనుల మీద పొలాలకు వెళ్లలేని పరిస్థితి దాపరించింది. శుక్రవారం ఉదయం కూడా సీతంపేట ప్రాంతమంతా దట్టమైన పొగమంచుతో కప్పబడింది. పర్యాటకులు సందర్శించేందుకు ఈ ప్రదేశం ఎంతో ఆహ్లదభరితంగా ఉన్నా వాహనదారులు, స్థానికులు, రైతులు మాత్రం పొగమంచుతో తీవ్ర సమస్యలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications