వెల్కం టు కాపిటల్, జగన్ ఓకే: బెజవాడ ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసన సభలో విజయవాడ పరిసర ప్రాంతాలను రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. దీంతో బెజవాడలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బెజవాడ, పరిసర వాసులు మిఠాయిలు పంచుకుంటున్నారు. బాణసంచా కాల్చుతున్నారు. వెల్ కం టు న్యూ కాపిటల్, విక్టరీ టు విజయవాడ అంటూ బెజవాడ, పరిసర ప్రాంతాల్లో ఏకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటన కంటే ముందే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. చంద్రబాబు ప్రకటన చేసే సమయంలో ఏం చేయాలనే విషయమై ఆ పార్టీ బుధవారం రాత్రి జగన్ నివాసంలో భేటీ అయి చర్చించింది. బెజవాడను రాజధానిగా ప్రకటన చేసే సమయంలో సభలో గందరగోళం చెలరేగింది. అయితే, ప్రకటన అనంతరం జగన్, ఆయన పార్టీ కూడా దానిని స్వాగతించింది. అయితే, ప్రకటన తర్వాత చర్చ చేపట్టడాన్ని మాత్రమే తప్పు పట్టింది. ముందే చర్చ చేపడితే బాగుండునని అభిప్రాయపడింది.
విజయవాడ రాజధాని వెనుక...!
విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడం పట్ల గల కారణాలను ప్రభుత్వం తెలిపింది. రాజధానిని నిర్ణయించేందుకు చాలా కసరత్తు చేశామని చంద్రబాబు సభలో ప్రకటించారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు.
నీరు, నష్టం సంభవించేందుకు ఉన్న అవకాశాలు, రహదారుల అనుసంధానం, అందుబాటులో ఉన్న భూమి, ప్రాంతీయ అభివృద్ధి లక్షణాలు కొలమానాలుగా చేసుకొని శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు 13 జిల్లాలలోని 22 పట్టణాలలో జల్లెడ పట్టింది. ఇందులో 4.67 మార్కులతో విజయవాడ తొలి స్థానంలో నిలిచింది. దీనికంటే కాస్త తక్కువగా 4.59 మార్కులతో విశాఖ నిలిచింది.
రాజధాని ప్రాంతంగా ప్రచారం జరిగిన విజయవాడ - గుంటూరులు సంయుక్తంగా 7.23 మార్కులతో మిగతా ప్రాంతాలకు అందనంత దూరంలో నిలిచింది. మిగతా నగరాలతో పోల్చితే విజయవాడకు ముప్పు తక్కువగా ఉంది. అనుసంధానం ఎక్కువగా ఉంది. నీటి లభ్యత ఎక్కువగా ఉంది. అభివృద్ధి కూడా ఉంది. మొత్తంగా విజయవాడకుకు 4.67 మార్కులు రాగా, విజయవాడ - గుంటూరు పరిసరాలకు 7.23 మార్కులు వచ్చాయి. విజయవాడ అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది.