జూన్ 27 సమీపిస్తోంది?: సచివాలయ ఉద్యోగుల కోరికల చిట్టా పెద్దదే!
విజయవాడ: జూన్ 27 సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి వెళ్తారా? లేదా అనే సందిగ్ధం ఇంకా వీడలేదు. అయితే జూన్ నుంచి అమరావతి నుంచే పరిపాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చర్యలు ఊపందకున్నాయి.
జూన్ 27 నుంచి ఉద్యోగులు మూడు విడతలుగా కొత్త రాజధానికి తరలి వెళ్లాలని మంత్రి నారాయణ స్పష్టంగా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ప్రతీ శాఖ నుంచి తొలి విడతగా ఉద్యోగుల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ టక్కర్ శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లోని సచివాలయంలో ఎంత మంది ఉండాలి, తాత్కాలిక సచివాలయానికి ఎంత మంది తరలి వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే అమరావతికి సచివాలయ ఉద్యోగులు కుటుంబ సమేతంగా వస్తారా? లేక ఒక్కరే వస్తున్నారా? పిల్లలు, వారి చదువులు... వంటి వివరాలను ప్రభుత్వం ఇదివరకే సేకరించింది. హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలో మొత్తం 1760 మంది పని చేస్తున్నారు. ఇందులో సుమారు 450 మంది ఉద్యోగుల విభజన తుది ప్రక్రియలో తెలంగాణకు వెళ్లనున్నారు.
దీంతో మిగిలిన 1150 మంది ఉద్యోగులు ప్రభుత్వానికి వివరాలు అందించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో 'ఐదు రోజుల పని'కి ప్రభుత్వం ఇప్పటికే సమ్మతించింది. ఉద్యోగుల పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలుగా ఖరారు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో ఏడాది పాటు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే సచివాలయ ఉద్యోగులు తమ దుర్భుద్ధి బయట పెట్టారు. వారంతంలో హైదరాబాద్ వచ్చేందుకు వీలుగా బస్సు పాస్ ఇవ్వాలని 846 మంది ఉద్యోగులు కోరారు.
అయితే ప్రస్తుతానికి వీరంతా సింగిల్ గా అమరావతికి వెళ్తున్న వారే కావడం విశేషం. కాగా తొలివిడతలోనే కుటుంబ సభ్యులతో సహా అమరావతికి వచ్చేందుకు 458 మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. 552 మంది ఉద్యోగులు ఒంటరిగానే వెళ్తామని తెలిపారు. తమకు హాస్టల్ వసతి కావాలని 470 మంది ఉద్యోగులు కోరారు.

అంతేనా విజయవాడ-హైదరాబాద్ మధ్య టోల్గేట్ల వద్ద తమ వాహనాలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని 234 మంది కోరుకున్నారు. 885 మంది కేడర్ ఉద్యోగులు అమరావతిలో లోకల్ బస్సుల్లో తిరిగేందుకు రాయితీతో బస్సు పాసులివ్వాలని కోరారు. ఇలా సచివాలయ ఉద్యోగుల కోరికల చిట్టా బాగా పెద్దదిగానే ఉంది.
మరోవైపు సచివాలయ ఉద్యోగుల్లో 102 మంది హైదరాబాద్లోని ప్రభుత్వ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. తాము అమరావతికి వచ్చినప్పటికీ... తమ కుటుంబాలను మాత్రం క్వార్టర్స్లోనే కొనసాగించడానికి అనుమతించాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఉండిపోయే కుటుంబ సభ్యులకు, తమకు వైద్య సౌకర్యం కల్పించాలని 192 మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల జీవిత భాగస్వాముల్లో 53 మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 34 మంది కేంద్ర ప్రభుత్వంలో, 172 మంది ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు. 239 మంది ఉద్యోగులు నూతన రాజధాని అమరావతిలో తమ పిల్లలకు స్కూళ్లలో సీట్లు కావాలని తెలిపారు.
నిజానికి సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది భార్యాభర్తలు ఉద్యోగాల్లోనే ఉన్నారు. దీంతో పిల్లలను ముందుగా విజయవాడకు వెళ్లి స్కూల్లో చేర్చడం వారికి వీలుకాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే విజయవాడలోని పేరుగాంచిన పాఠశాలలో సీట్లు అయిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు తమ పిల్లలను హైదరాబాద్లోనే స్కూళ్లలో కొనసాగించి, తాము మాత్రమే అమరావతికి వెళ్లాలని భావిస్తున్నారు. ఇలా ఏపీ సచివాలయ ఉద్యోగులు చిట్టాలను ఏపీ ప్రభుత్వం నెరవేరుస్తుందో లేదో చూడాలి. రాష్ట్ర విభజన సమయంలో సచివాలయం ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు.
ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే తాము చెట్ల కింద కూర్చోని అయినా పనిచేస్తామని చెప్పారు. కానీ ఇప్పడిలా వారి వారి కోరికల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచడం గమనార్హం.












Click it and Unblock the Notifications