అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన .. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పరిమితికి మించి అప్పులు తేవడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసిపి ప్రభుత్వం పాతాళం వైపు నడిపిస్తుందని టిడిపి విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.
రాజ్యసభలో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆదాయానికి మించి ఉన్నాయని ఈ సమాధానం ద్వారా స్పష్టం చేశారు. 2020 - 21 సంవత్సరానికి 54369 .18 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి 30,305 కోట్ల అప్పుకు అనుమతి కోరిందని కేంద్రం పేర్కొంది.
ఇదిలా ఉంటే కోవిడ్ కారణంగా మరో 19,192 కోట్ల అప్పుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 49, 497 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తే 54,369 కోట్లు అప్పు చేసి నట్టు కేంద్రం పేర్కొంది. మొత్తంగా కేంద్రం అనుమతి ఇచ్చిన పరిమితికి మించి ఏపీ 4872 కోట్ల అప్పు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులపై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సమయంలో, కేంద్రం తాజాగా ఇచ్చిన లిఖితపూర్వక సమాచారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. అప్పుల్లో ఏపీ అగ్రభాగాన నిలిచిందని చెప్పకనే చెబుతుంది.
రోజురోజుకు రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఏపీ అప్పులను గతంలోనే కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించింది. అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఏపీ అప్పులు ఉన్నాయని కాగ్ తేల్చింది. ప్రభుత్వం వంద రూపాయలు ఖర్చు చేస్తే అందులో 45 రూపాయలు రుణమేనని గతంలోనే కాగ్ వెల్లడించింది.