ఏపీలో మరో శిరోముండనం- అప్పు తీర్చలేదని కారులో తీసుకొచ్చి మరీ- జంగారెడ్డిగూడెంలో...
ఏపీలో శిరోముండనం ఘటనలు పెరిగిపోతున్నాయి. గతంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, ఆ తర్వాత విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం ఘటనలు జరిగినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాష్టంలో ఇది వరుసగా మూడో ఘటన.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన అలక అభిలాష్ జంగారెడ్డి గూడెంకు చెందిన యర్రసాని విజయబాబు దగ్గర మూడు నెలల క్రితం కరోనా సమయంలో 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ బాకీ తీర్చాలని విజయ్బాబు కొన్నిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. అయినా బాకీ తీర్చకపోవడంతో ఆగ్రహానికి గురైన విజయ్బాబు ఈ నెల 3వ తేదీన రాత్రి తన మిత్రులు షేక్ నాగూల్ మీరా వలీ, కంకిరెడ్డి మార్కండేయులుతో కలిసి తాడేపల్లి గూడెంలోకి అభిలాష్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి అభిలాష్ను కారులో ఎక్కించుకుని నేరుగా జంగారెడ్డిగూడెం గంగానమ్మ లే అవుట్ కాలనీకి తీసుకొచ్చారు.
Recommended Video
కాలనీలోని ఓ ఇంట్లో అభిలాష్ను ఉంచి క్షురకుడిని పిలిపించి విజయ్బాబు సహచరులతో కలిసి గుండు కొట్టించారు. అనంతరం బాధితుడిని స్ధానిక ఆర్టీసీ బస్లాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటికి తెలిసింది. జంగారెడ్డి గూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రెండు శిరోముండనం ఘటనలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.