అమెరికా టూర్: 7 రోజుల్లో 7వేల కి.మీ., చంద్రబాబు భవిష్యత్ ప్లాన్ ఇదే!
వారం రోజుల పాటు అమెరికా పర్యటలో 7వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు.మరో వైప
అమరావతి: వారం రోజుల పాటు అమెరికా పర్యటలో 7వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు.మరో వైపు ప్రపంచంలో ఎక్కడున్నా కూడ తెలుగువాళ్ళు నంబర్ వన్ గా ఉండాలని చంద్రబాబునాయుడు ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమెరికాలోని తెలుగు సంఘాలతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడ ఈ టూర్ లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను బాబు ఈ పర్యటనను ఉపయోగించుకొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయన పారిశ్రామికవేత్తలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఉన్న అవకాశాలను కూడ చంద్రబాబునాయుడు వివరించారు. అంతేకాదు తన అమెరికా పర్యటన వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
7 రోజులు 7 వేల కిలోమీటర్ల ప్రయాణం
పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన అమెరికా పర్యటన విజయం సాధించిందనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు.ఈ మేరకు అమెరికాలో తన పర్యటన వివరాలను ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. వారం రోజుల పాటు 7 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు 15 నగరాలను సందర్శించినట్టు చెప్పారు. 90కిపై ప్రముఖులు, ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. 30కి పైగా సమావేశాలను నిర్వహించినట్టు చెప్పారు. తన పర్యటన కారణంగా సుమారు 12, 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం ఉందన్నారు. మరో వైపు వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ, ఆటోమోటివ్ రంగాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బాబు ప్రకటించారు.
తెలుగువాళ్ళే ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండాలి
ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కాని తెలుగువాళ్ళే నంబర్ వన్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటన చివరిరోజున గురువారం నాడు ఆయన తెలుగు సంఘాల ప్రతినిధులతో చికాగో లో సమావేశమయ్యారు. తానా, ఆటాతో పాటు, తెలంగాణ, ఆంధ్రతో నిమిత్తం లేకుండా అన్ని సంఘాల నుండి ఐదుగురుచొప్పున ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదగాలని ఆయన తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు.
తెలుగువారి విజయ రహాస్యం గురించి చర్చించుకోవాలి
అమెరికాలో ఉంటున్న తెలుగువారి తదుపరి లక్ష్యం ఏమిటనేదానిపై కేంద్రీకరించాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు సందర్భంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు దక్కాయని ఆయన తాను ఎందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశానో వివరించారు. ప్రపంచంలో తెలుగువారే నెంబర్ వన్ కావాలి. దీంతో తెలుగువారి విజయరహస్యాన్ని ప్రపంచమంతా చర్చించుకోవాలన్నారు బాబు.కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు చంద్రబాబు.కేపీఎంజీ సంస్థ ప్రపంచంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక ఇస్తోంది.ఈ అవకాశాలను తెలుగువారు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.
అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలతో స్టీరింగ్ కమిటీ
అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలతో ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ కమిటీ పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపున ఎపీఎన్ఆర్ టీ ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే తానా, అటా తదితర సంఘాలున్నాయి. కొత్తగా ఒక స్టీరింగ్ కమిటీని కూడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.ఈ సంఘాలన్నీ సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. వేర్వేరు పేర్లతో ఉన్న సంఘాలన్నీ తమ ఉనికిని చాటుకొంటూనే ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని ఆయన సూచించారు.