కరోనా సెకండ్ వేవ్ పై పోరులో ఏపీ భేష్- లోకల్ సర్కిల్స్ సర్వేలో రెండోస్ధానం-టాప్ తమిళనాడు
రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా మొదలైన కరోనా రెండో దశ ప్రభావం ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విచ్చలవిడిగా కొనసాగింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటూనే మరోవైపు కరోనాను పలు రాష్ట్రాలు సమర్ధవంతంగా నియంత్రించగలిగాయి. ఇలాంటి రాష్ట్రాలపై తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఏపీ టాప్ 2లో నిలిచింది.
సెకండ్ వేవ్ పై ఏపీ పోరు భేష్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బారిన టాప్ 5 రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ కూడా ఒకటి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం ఏపీపై చాలా ఎక్కువగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఇక్కడ అధికంగా ఉంది. అయినా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఏపీ సత్తా చాటుకుంది. ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించిన కోవిడ్ పరీక్షలతో పాటు చికిత్సల విషయంలో రేట్ల నిర్ధారణ, ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణ ఇలా పలు విషయాల్లో ఏపీ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరిచింది. దీంతో తాజాగా లోకల్ సర్కిల్స్ అనే ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నిర్వహించిన సర్వేలోనూ ఈ విషయం నిరూపణ అయింది.
లోకల్ సర్కిల్స్ సర్వే
లోకల్ సర్కిల్స్ అనే ఓ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కరోనా సెకండ్ వేవ్ ను దీని బారిన పడిన రాష్ట్రాలు ఎలా ఎదుర్కొన్నాయనే విషయంలో తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో తమిళనాడు టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత స్ధానంలో ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది.
కరోనా నియంత్రణలో ఏపీకి రెండో స్ధానం
ఏపీలో ప్రభుత్వం కరోనా సమయంలో వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, ప్రజల్లో సంతృప్తి ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఏపీలో వైసీపీ సర్కార్ కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో మెరుగైన పనితీరు ప్రదర్శించినట్లు స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందని కితాబిచ్చారు. ఫిబ్రవరిలో రోజుకు సగటున 70 కొత్త కేసులు నమోదు కాగా.. మే 16న అత్యధికంగా 24 గంటల్లో 24171 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు కూడా లభించడం కష్టమైంది. అయినా ప్రభుత్వం అందుబాటులో ఉన్న వనరులతోనే మెరుగైన పనితీరు కనబర్చినట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.
Recommended Video
సెకండ్ వేవ్ ను ఏపీ ఎలా అడ్డుకుందో తెలుసా ?
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్ధితుల్లో వైసీపీ సర్కార్ అమలు చేసిన కొన్ని విధానాలు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగాయి. ఇందులో ప్రధానంగా కమ్యూనిటీ ట్రాకింగ్ సిస్టమ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సర్వే సంస్ద తెలిపింది. క్షేత్రస్ధాయిలో భారీ ఎత్తున సిబ్బంది ఇందుకు దోహదపడ్డారని సర్వే సంస్ధ వెల్లడించింది. అంటే ఆశావర్కర్లు, వాలంటీర్లు, ఇతర హెల్త్ వర్కర్ల సాయంతో కరోనా గుర్తింపు సక్రమంగా సాగిందని సర్వేలో తేలింది. కోవిడ్ వ్యాప్తి తీరుపై సోషల్ మీడియాలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిన అలర్ట్ లు కూడా బాగా పనిచేశాయని సర్వే సంస్ధ వెల్లడించింది.