వెంకటేశ్వరస్వామివారి వేషంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. రాయలసీమలోనే అతి పెద్ద జాతరగా దీన్ని భక్తులు అభివర్ణిస్తారు. తిరుమల కొండపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారికి గంగమ్మ తల్లి చెల్లెలు అవుతుంది. తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో వెళ్లి అమ్మను దర్శించుకుంటారు.
అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీ వెంకటేశ్వరస్వామివారి వేషధారణలో వెళ్లి గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని సారె అందజేశారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని అమ్మను కోరుకున్నట్లు తెలిపారు.
ఈనెల 10వ తేదీన ప్రారంభమైన జాతర 17వ తేదీన ముగియనుంది. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల నుంచి భక్తులు లేకుండా ఏకాంతంగా జాతర జరిపించారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది భక్తులను అనుమతించారు. ఈ దేవాలయానికి 900 సంవత్సరాల చరిత్ర ఉంది. అనంతాచార్యులవారు ఈ ఆలయాన్ని నిర్మించారు. జాతర ప్రారంభం రోజు శ్రీవారి ఆలయం నుంచి సాంప్రదాయంగా సారె అందుతుంది.
గతంలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శించుకోవాలనే నియమాన్ని భక్తులు పాటించేవారు. ప్రస్తుతం ఆ నియమం ఎవరూ పాటించడంలేదు. మాతంగి, దొర, బండ, తోటి, బైరాగి, సున్నపు కుండలు లాంటి వేషాలు వేసుకొని భక్తులు గంగమ్మతల్లిని దర్శించుకుంటారు. అలా చేయడంవల్ల చిన్నపిల్లలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారనే దృఢనమ్మకం భక్తుల్లో ఉంది.