బాబు వల్లే హైదరాబాద్లో బిజినెస్ స్కూల్: అంబానీ, రక్షణ ఉత్పత్తుల్లోకి 'అడాగ్'
విశాఖ: నారా చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాదులో బిజినెస్ స్కూల్ వచ్చిందని అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ ఆదివారం నాడు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ మిషన్ ఇంపాజిబుల్ అని కితాబిచ్చారు. ఏపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'సన్రైజ్ ఏపీ' పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభమైంది.
హార్బర్ పార్క్లోని ఏపీఐఐసీ మైదానంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సర్కారు, సీఐఐ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును ప్రారంభంచిన అనంతరం చంద్రబాబుతో కలిసి జైట్లీ... ఏపీ పెవిలియన్ను పరిశీలించారు.
ఈ రోజు నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఐటీ, పోర్టులు, గనులు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పార్కులు తదితర రంగాల్లో ఆసక్తి చూపిన సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.

ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ అంబానీ మాట్లాడారు. ప్రధాని మోడీ మిషన్ ఇంపాజిబుల్ అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాదులో బిజినెస్ స్కూల్ వచ్చిందన్నారు. భారత్, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.
విశాఖ జిల్లాలో రూ.5వేల కోట్లతో నౌకా స్థావరం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాంపల్లిలో నౌకాదళ స్థావరం ఏర్పాటుకు ప్రభుత్వంతో అంబానీకి చెందిన అడాగ్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, పదివేల కోట్లతో రక్షణ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిల్ అంబానీ చెప్పారు.
సదస్సు ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, పీయూష్ గోయెల్, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంథి మల్లికార్జున రావు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications