నవంబర్ నుంచి అన్నా క్యాంటీన్లు: నారాయణ
హైదరాబాద్: నవంబర్లో అన్నాక్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్లలో ఒక రూపాయికే సాంబారు ఇడ్లీ అందించడం జరుగుతుందని చెప్పారు. రూ 5కే లెమన్, పెరుగు, సాంబార్ రైస్ అందిస్తామని ఆయన చెప్పారు.
అంతేకాకుండా రూ. 5కే రెండు చపాతీలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తొలి విడతగా విశాఖపట్నంలో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 ఎన్టీఆర్(అన్నా) క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ శాఖలో 2,240మంది సిబ్బంది కొరత ఉందని ఆయన తెలిపారు.
పన్నుల భారం మోపకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.అక్టోబర్ 2 నుంచి 222 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆన్లైన్ ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రజల అవసరాలు ఏమున్నా ఫొటో తీసి ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు ఫొటో పంపిస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధి మిషన్ వందశాతం అమలు చేస్తామని చెప్పారు.