చంద్రబాబుపై n440k ఫిర్యాదుల పర్వం- తాజాగా కృష్ణాజిల్లా మైలవరంలో
ఏపీలోని కర్నూల్లో ఎన్440కే వైరస్ ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటికే కర్నూలుతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కేసులు నమోదవుతుండగా.. ఇవాళ కృష్ణాజిల్లా మైలవరంలోనూ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎన్440కే వైరస్ ఉందంటూ వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించారని, జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణాజిల్లా మైలవరం పీఎస్లో కొందరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుచోట్ల చంద్రబాబుపై దాఖలైన ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. మైలవరంలోనూ కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు. దీంతో కర్నూలు, చిత్తూరు, గంటూరు, కృష్ణాజిల్లాల్లో న్యాయవాదులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
మరోవైపు చంద్రబాబు చేసిన ఎన్ 440కే వైరస్ వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు మంత్రి అప్పలరాజు చేసిన దాదాపు ఇలాంటి వ్యాఖ్యలపై మాత్రం కేసుల వరకూ వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. అప్పలరాజుపై ఫిర్యాదు చేసిన గుంటూరు టీడీపీ నేతలపై పోలీసులు ఏకంగా కోవిడ్ కేసులు నమోదు చేయడం కూడా వివాదాస్పదమైంది. దీంతో పోలీసుల తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉన్నతాధికారుల సూచనలమేరకే పోలీసులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.