ఫిరాయింపులను ప్రోత్సహించారంటూ సిఎం చంద్రబాబుపై హైకోర్టులో మరో కేసు
అమరావతి: ఫిరాయింపులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యుడు వీర్ల సతీష్
హై కోర్టులో కేసు వేశారు. సిఎం చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన శాసన సభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహించారని వీర్ల సతీష్ తన పిటీషన్ లో పేర్కొన్నట్లు తెలిసింది.
అలాగే ఈ పిటిషన్ లో ఫిరాయింపు ఎంఎల్ఏల పైనే కాకుండా ఫిరాయింపు మంత్రులను, అసెంబ్లీ వ్యవహారాల శాఖ కార్యదర్శిని, తెలుగుదేశం పార్టీని కూడా పిటీషనర్ ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది. ఫిరాయింపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాను పలుమార్లు కోరినా స్పీకర్ పట్టించుకోలేదని కూడా సతీష్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్నిఉల్లంఘించిన కారణంగా ప్రతివాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషనర్ హై కోర్టును కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించటమే కాకుండా నలుగురికి మంత్రి పదవులను ఇవ్వటం నైతికంగా ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నది పిటిషనర్ సతీష్ వాదనగా తెలుస్తోంది. అందుకే ఆయన తన పిటీషన్లో చంద్రబాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అయితే ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి కొంతమంది కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఆ క్రమంలో ఇటీవలే ఫిరాయింపులకు సంబంధించి ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు దాఖలు చేసిన కేసులో వైసిపి తరఫున ఎన్నికల్లో గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు మార్చి 13న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications