ఫిబ్రవరి 10న టీడీపీ మరో పోరుబాట: కారణం ఏమిటంటే
Recommended Video
ఇప్పటికే రాజధాని అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న టీడీపీ ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం అయ్యింది . ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది . పెన్షన్ దారుల పక్షాన పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ అందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తంగా నిర్ణయించింది. వైసీపీ సర్కార్ పించన్ తొలగించటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలని పిలుపునిచ్చింది.
10వ తేదీన టిడిపి వర్గాలు పెన్షన్ దారులతో కలిసి ఆందోళనలు
నేడు టీడీపీ పార్టీ రాష్ట్ర, జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కార్ నిరుపేదలైన వారికి 7లక్షల మందికి పించన్ల తొలగింపు అన్యాయమని పేర్కొన్నారు . పించన్ల తొలగింపునకు నిరసనగా ఫిబ్రవరి 10వ తేదీన టిడిపి వర్గాలు పెన్షన్ దారులతో కలిసి ఆందోళనలు నిర్వహించాలని చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలకు పిలుపునిచ్చారు. ఎలాగైనా పించన్ దారులందరికీ పించన్ వచ్చేలా పోరాటం చెయ్యాలని సూచించారు.
లక్షలాది పెన్షన్లు తొలగించటంపై చంద్రబాబు ఆగ్రహం
స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతులు అందజేయాలని పేర్కొన్న చంద్రబాబు సమరశంఖం పూరించాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. బతికున్నవాళ్లను చనిపోయినట్లు చూపడం, లక్షలాది పించన్లు తొలగించడం అమానుషమని మండిపడిన చంద్రబాబు కావాలనే టీడీపీకి చెందిన వారని భావించిన వారిని, నిరుపేద వృద్దులు, వికలాంగులను లిస్టు నుండి తొలగించారని ఆరోపించారు.
ఒక్క పించన్ తొలగించినా సహించేది లేదని హెచ్చరిక
వైసీపీ లీడర్లు దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు . ప్రశ్నించినవారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు . అంతేకాదు ఒక్క పించన్ తొలగించినా సహించేది లేదని హెచ్చరించారు. వాలంటీర్ల అక్రమ వసూళ్లను అడ్డుకోవాలని టీడీపీ వర్గాలకు పిలుపునిచ్చారు. వృద్దుల నుంచి లంచాల రూపంలో 500 వసూళ్లు చేస్తే సహించేది లేదన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చెయ్యాలని దిశా నిర్దేశం
వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని వైసీపీ ఎంపీనే అంగీకరించారని చంద్రబాబు పేర్కొన్నారు. తమ హయాంలో 54 లక్షల మందికి పించన్లు ఇచ్చామని, పెన్షన్ మొత్తాన్ని 200 రూపాయల నుంచి 2 వేల రూపాయలకు పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ వైసీపీ సర్కార్ ఏడు లక్షల మందికి పెన్షన్ కట్ చేసి వారిని వేదనకు గురి చేస్తుందని బాబు అసహనం వ్యక్తం చేశారు. 10న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాబు పార్టీ నేతలకు చెప్పారు.