విభజన: కాంగ్రెసుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని స్వప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు పూనుకుందని తోట త్రిమూర్తులు విమర్శించారు.
కాగా, మరో శాసనసభ్యుడు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఎలమంచిలి శాసనసభ్యుడు యువి రమణమూర్తి రాజు (కన్నబాబు) కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు.
తన నియోజకవర్గం ప్రజల అభిమతాన్ని తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక తెలియజేస్తానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీకి రాజీనామాలు చేశారు.
మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప రెడ్డి కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా రాజీనామా చేశారు.