YSRCP: వైసీపీ నుంచి మరో రెబెల్ ఎంపీ?? అధిష్టానానికి ఫలితం లేని ఫిర్యాదు?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది లోక్సభ సభ్యులున్నారు. వీరిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ప్రస్తుతానికి ఆయనకు వైసీపీ రెబెల్ ఎంపీ అనే ముద్ర పడింది. తాజాగా అదే పార్టీ నుంచి మరో ఎంపీ ఆయన బాటలోనే నడవబోతున్నాడా? అనే సందేహం రాజకీయ విశ్లేషకుల మదిని తొలిచేస్తోంది. ఆయన ఎవరో కాదు గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు.
సామాజిక న్యాయభేరి సదస్సుకు గైర్హాజరు!
మంత్రులంతా ఇటీవల జరిపిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఆయన సొంత నియోజకవర్గం నరసరావుపేటకు వచ్చినా లావు కనపడలేదు. తర్వాత జరిగిన బహిరంగ సభకు గైర్హాజరయ్యారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల వైఖరిపట్ల ఆయన కినుక వహించారని, అధిష్టానానికి చెప్పినా సరైన చర్యలు తీసుకోలేదని లావు కృష్ణదేవరాయలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో విభేదాలే??
లావు కృష్ణదేవరాయలు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనప్పటినుంచి తన నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, వినుకొండ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు లేవని సీనియర్ రాజాకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మరో వైసీపీ నేత మర్రి రాజశేఖర్తో ఎంపీ లావు సన్నిహితంగా ఉంటారు. అలాగే వినుకొండ నియోజకవర్గంలో సీనియర్ నేత మక్కెన మల్లికార్జునరావుతో ఉన్న సన్నిహిత సంబంధాలవల్ల ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో దూరం పెరిగిందని భావిస్తున్నారు.
అజాతశత్రువు ఎంపీ లావు
అజాతశత్రువుగా రాజకీయాల్లోకి వచ్చిన లావు కృష్ణదేవరాయలు తన నియోజకవర్గ పరిధిలోని ఏ ఎమ్మెల్యేలతోను వివాదం పెట్టుకోలేదు. వివాదరహితుడిగా మంచి పేరుంది. కానీ ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలవల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా సరైన న్యాయం జరగడంలేదని భావిస్తున్న లావు చివరి నిముషంలో పార్టీ మారే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో? లేదో? కానీ పార్టీలో లావుకు అన్యాయం జరుగుతోందనే మాట మాత్రం వాస్తవమంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.