వైసీపీకి మరో దెబ్బ..! ఎమ్మెల్సీ డ్రైవర్ కేసులో కోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం స్కాం కేసు ఆ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు జగన్ పర్యటనల్లో నమోదైన కేసుల విషయంలో మాజీ మంత్రులు సైతం పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
2022లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని అత్యంత దారుణంగా కొట్టి చంపేసి మూట గట్టి అతని ఇంట్లోనే పడేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తానే ఈ హత్య చేసినట్లు అనంతబాబు ఇప్పటికే పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఈ కేసు ముగించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు అనుమతి కోరింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం వినతిపై విచారణ జరిపిన రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి ఈ కేసులో పూర్తిస్దాయిలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం అనంతబాబు బెయిల్ పై బయటే ఉన్నారు. కోర్టు తాజా ఆదేశాలతో ఆయన్ను మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కూటమి సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విపక్షంలో ఉన్నప్పుడే కూటమి పార్టీలు అనంతబాబు డ్రైవర్ హత్య కేసును రాజకీయంగా వాడుకున్నాయి. తద్వారా ఎస్సీ వర్గాల ఓట్లను ఆకర్షించాయి. ఇప్పుడు అధికారంలో ఉండటంతో ఈ కేసులో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లాయర్ ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. తద్వారా అనంతబాబుకు శిక్ష పడేలా చూసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications