చంద్రబాబుకు మరో షాక్ .. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఎసరు పెట్టిన వైసీపీ నేతలు
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ టార్గెట్ గా పని చేస్తుంది. చంద్రబాబుకు వరుస షాకులను ఇస్తుంది. మొదట ప్రజా వేదికతో ప్రారంభించిన కూల్చివేతల ప్రస్థానం ఇంకా టీడీపీ టార్గెట్ గా కొనసాగేలా వుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై గట్టిగా దృష్టి పెట్టిన వైసీపీ మొన్నటికి మొన్న విశాఖపట్టణంలోని టీడీపీ కార్యాలయానికి అనుమతులు లేవని చేసిన ఫిర్యాదుతో నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా గుంటూరులో ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యాలయంగా చెప్పుకునే పార్టీ ఆఫీసుకే ఎసరు పెట్టారు వైసీపీ నేతలు.
టీడీపీ నేతలు 400 కోట్లు దొబ్బేశారట .. సభా పర్వంలో మంత్రి.. తప్పన్న స్పీకర్ , టీడీపీ
చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు టీడీపీ టార్గెట్ గా కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక కూల్చేసిన తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు ఇల్లు అక్రమమని అధికారులు తేల్చి నోటీసులు ఇచ్చారు. టీడీపీకి ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ నేతలు వదలడం లేదు. టీడీపీ తరపున గెలిచిన 23మంది ఎమ్మెల్యేలో కొందరిపై ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కోర్టుకు వెళ్లి ఇరుకున పెట్టి మానసికంగా చిరాకు పెట్టిస్తున్నారు . ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ కార్యాలయాలను కూడా టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలకు, అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
మొన్న విశాఖ పట్టణం , నేడు గుంటూరు టీడీపీ ఆఫీసుల టార్గెట్ ..
ఎప్పుడైతే సీఎం జగన్ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారో అప్పుడే వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారా అన్న దానిపై దృష్టి సారించారు. ప్రభుత్వస్థలాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన టీడీపీ భవనాలపై ఫోకస్ పెట్టారు . ఇప్పటికే విశాఖపట్నం టీడీపీ కార్యాలయంపై ఎలాంటి అనుమతులు లేకుండా.. ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించి నిర్మించారని వైసీపీ ఫిర్యాదు చెయ్యటంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. ఇప్పుడు ఏకంగాగుంటూరులోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై వైసీపీ ఫోకస్ పెట్టింది.
గుంటూరు కార్యాలయం ప్రభుత్వ స్థలంలో ఉందని ఫిర్యాదు .. టీడీపీని అష్టకష్టాలు పెడుతున్న వైసీపీ నేతలు ..
ప్రజా వేదిక కూల్చివేత తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా లోకేష్ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇదే సమయంలో గుంటూరు వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీసును ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని.. వెంటనే ఆ భవనాన్ని కూల్చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూమికి సంబంధించిన ఆధారాలను కూడా అందజేశారు. మరి ఈ ఫిర్యాదులపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ నిబంధనలకు విరుద్దంగా ఉంటే కూల్చివేతలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా టీడీపీని ఇంతగా టార్గెట్ చేసుకోవటంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెడితే పాలన కంటే టీడీపీ ని టార్గెట్ చేస్తూ కూల్చివేతలకు పాల్పడటం ఒకింత అసహనానికి కారణం అవుతుంది. ఇక టీడీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలు తప్ప మరేమీ కాదని అంటున్నారు. విశాఖ, గుంటూరు పార్టీ కార్యాలయాలే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పనిలో ఉన్న వైసీపీ టీడీపీని ముప్పతిప్పలు పెట్టటమే లక్ష్యంగా పెట్టుకుంది.