కర్నూలు లో మరో 'స్వాతి'.. ప్రియుడి మోజులో భర్త హత్య!
కర్నూలు జిల్లా: ప్రియుడిపై మోజుతో భర్త స్థానంలోకి ప్రియుడిని తెచ్చేందుకు విఫల ప్రయత్నం చేసి కటకటాలపాలైన నాగర్కర్నూలు జిల్లాకు చెందిన స్వాతిని మర్చిపోకముందే ఎపిలోని కర్నూలు జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక్కడ కూడా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో ఇల్లాలు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన 35 ఏళ్ల వడ్డె చిన్నమద్దయ్య తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.అయితే రెండేళ్ల కిందట వెంకటేశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ బాషాతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి మద్దయ్య భార్యను నిలదీశాడు. దీంతో ఆమె ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకొని శాశ్వతంగా ప్రియుడు బాషాతో కలిసి ఉండిపోవాలనుకుంది. అందుకే భర్త మద్దయ్య హత్యకు ప్లాన్ చేసింది.

భర్త హత్యకు సుపారి...
భర్తను హత్య చేసేందుకు బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్తో బేరం కుదుర్చుకుంది. లక్ష రూపాయలకు ఒప్పందం కుదరగా ముందుగా రూ.80వేలు అడ్వాన్స్గా చెల్లించారు. దీంతో మరోహర్ పథకం ప్రకారం మద్దయ్యకు స్నేహితుడిగా మారాడు. డిసెంబర్ 4 తేదీన మద్దయ్యను పూడిచెర్లకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మద్దయ్య బాగా మత్తులోకి జారుకున్నాక బలపాలపల్లెకే చెందిన మల్లిఖార్జున్ సాయంతో మద్దయ్య తలపై బండరాయితో మోది మనోహర్ అతడిని హతమార్చాడు.

అయితే పోలీసులు తొలుత ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. అయితే వెంకటేశ్వరమ్మ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో విచారణ చేశారు. కొంత సమాచారం తెలిసిన తరువాత పోలీసులు వెంకటేశ్వరమ్మను విచారించడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో హత్య కేసు నమోదు చేసి వెంకటేశ్వరమ్మతో సహా నిందితులందరినీ అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications