ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త ముప్పు!
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పైన దొంగ నోట్ల ముఠా కన్ను పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కొత్త రాజధాని కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి భూమికి భారీ డిమాండ్ ఉంది. పెద్ద ఎత్తున నగదు చేతులు మారేందుకు అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆర్థిక ఉగ్రవాదం నష్టపరిచేందుకు సిద్ధంగా ఉందని, ఇది నవ్యాంధ్రకు కొత్త ముప్పు అని అంటున్నారు. దొంగ నోట్ల ప్రవాహం జోరుగా కొనసాగుతోందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి అంటున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాలో నెలకొని ఉన్న రాజధాని అమరావతి పైన దొంగ నోట్ల ముఠా కన్ను పడినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే గుంటూరులో ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారి నుంచి చాలా సమాచారం బయటపడిందని అంటున్నారు.
పోలీసుల దర్యాఫ్తులో దొంగనోట్ల మార్పిడి ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని తేలిందని సమాచారం. రూ.500, రూ.1000 నోట్లు ఎక్కువగా చలామణిలో ఉండటంతో, అసలును పోలినట్లుగా నకిలీవి తయారు చేస్తున్నారు. వాటిని నకిలీ కరెన్సీ యంత్రాలు తప్ప కనిపెట్టలేని విధంగా ఉంటాయి.
రాజధానిలో క్రయవిక్రయాలు జరుగుతున్నందున దొంగ నోట్ల ముఠాలు దృష్టి పెట్టాయని అంటున్నారు. వారు దొంగనోట్లను చాకచక్యంగా మారుస్తుంటారు. అంతేకాదు, వీటిని మార్చేందుకు కమీషన్ కూడా ఎరవేస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులను దాటిస్తూ ఈ దొంగనోట్లను తెస్తున్నట్లుగా తెలుస్తోంది.