కోడికత్తి కేసులో మరో ట్విస్ట్- జగన్ అభ్యంతరాలు- నేడు తేల్చబోతున్న ఎన్ఐఏ కోర్టు..!
ఏపీలో గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. జగన్ పై కోడి కత్తి దాడికి పాల్పడిన జనిపల్లి శ్రీనివాస్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు ఇప్పటివరకూ బెయిల్ లభించడం లేదు. అదే సమయంలో ఈ దాడి వెనుక ఎవరున్నారనే అంశం కూడా తేలడం లేదు. కానీ ఎన్ఐఏ మాత్రం ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదంటూ విజయవాడ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసేసింది.
దీంతో ఎన్ఐఏ ఛార్జిషీట్ పై విమర్శలు వచ్చాయి. కోడి కత్తి దాడి కేసులో అసలు కుట్ర కోణం తేల్చకుండా ఈ కేసును హడావిడిగా ముగించేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ఎన్ఐఏ ఛార్జిషీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు సక్రమంగా సాగలేదని, ఇందులో అసలు కుట్రకోణం వెలుగుచూడాలంటే మరింత లోతైన దర్యాప్తు అవసరమని వాదిస్తున్నారు. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జగన్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.

వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేయడం వెనుక ఎవరున్నారనేది ఎన్ఐఏ తేల్చలేకపోయిందని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే ఈ కేసులో విస్తృత కుట్రకోణం బయటపడాలంటే మరింత లోతుగా ఎన్ఐఏ దర్యాప్తు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి. ట్రయల్ కోర్డు ఇచ్చే ఆదేశాలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు తప్పేలా లేవు.
మరోవైపు కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని వాదిస్తున్న ఎన్ఐఏ.. తదుపరి దర్యాప్తుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే ఈ కేసు మరో మలుపు తీసుకోవడం ఖాయం. నిన్నటి వాదనల తర్వాత ఎన్ఐఏ కోర్టు ఇవాళ్టికి విచారణ వాయిదా వేసింది. ఇవాళ వాదనలు విన్న తర్వాత ఎన్ఐఏ కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications