అమిత్ షా ఆఫర్, బాబు తర్జన భర్జన: కేంద్రమంత్రి రేసులో జేసీ, నిమ్మల
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కే అవకాశముంది. కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఇటీవలే ఎన్నికయ్యారు. దీనికి ప్రతిగా ఓ కేంద్రమంత్రి పదవి, పలు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టిడిపికి మరో కేంద్రమంత్రి పదవి దక్కనుండటంతో ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పదవి ఛాన్స్ ఎవరికి దక్కనుందనే విషషయం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. అలాగే, ఎంపీలు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం టిడిపి నుంచి తరఫున సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్రమంత్రులుగా ఉన్నారు. మరో పదవిని ఆఫర్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. అందుకు ఇద్దరు ఎంపీల పేర్లను సూచించాలని పేర్కొన్నారని తెలుస్తోంది.
ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక శాఖల మార్పులో భాగంగా వెంకయ్య నాయుడిని గ్రామీణాభివృద్ధి శాఖకు మార్చిన పక్షంలో, పట్టణాభివృద్ధి శాఖ టిడిపి ఖాతాలోకి వస్తుందంటున్నారు.
ప్రస్తుతం మంత్రులు కోస్తాకు చెందినవారు కావడంతో, ఈసారి అవకాశం రాయలసీమకు దక్కుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా మాత్రం జేసీ, అనంతల పేర్లు వినిపిస్తున్నాయి.