పదోతరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ క్లారిటీ- మా నిర్ణయం అదేనన్న విద్యామంత్రి.....
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులను ప్రమోట్ చేస్తున్న దృష్ట్యా ఏపీలోనూ అదే నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ఒంగోలులో క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే జూలై 10 నుంచి నిర్వహిస్తామని విద్యామంత్రి సురేష్ ప్రకటించారు. విద్యార్ధులు, తల్లితండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని సురేష్ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.
Recommended Video
అంతకు ముందు తెలంగాణ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా భయాలతో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చేసిన ప్రభుత్వాలు... అంతకు ముందు ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించాలనే నిర్ణయిం తీసుకున్నాయి. ఏపీలోనూ కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.