స్టూడెంట్స్ గెట్ రెడీ: మార్చి 23న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..ఏర్పాట్లు పూర్తి
విజయవాడ: 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి.ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా ఈ పరీక్షలు పూర్తికాగానే 10వ తరగతి పరీక్షలు కూడా జరుగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పరీక్షలో విజయం సాధించేందుకు శ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల అంటే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. అంతకంటే ముందు ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 4 నుంచి మార్చి 23 వరకు జరుగుతాయి.
Recommended Video
మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు...
బుధవారం మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షల గురించి వెల్లడించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 4 నుంచి మార్చి 23వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహిస్తుందని వెల్లడించింది. ఇంటర్మీడియెట్ పరీక్షలు 1411 కేంద్రాల్లో నిర్వహిస్తామని చెప్పిన మంత్రి సురేష్ 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇక పదవ తరగతి విషయానికొస్తే 6,39,022 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షకు హాజరవుతారని 2,923 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని మంత్రి సురేష్ చెప్పారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సూచించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. కోఆర్డినేషన్ టీమ్స్, రెవిన్యూ, హెల్త్, పోలీస్, లేబర్, మరియు మెడికల్ ఏజెన్సీల నుంచి పలువురిని నియమించామని వీరంతా పరీక్షలు సజావుగా సాగేందుకు సహకరిస్తారని మంత్రి చెప్పారు. ఇక పరీక్షాకేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
కంట్రోల్ రూం నుంచి సమీక్ష
పదవ పరీక్షల కోసం 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మంత్రి సురేష్.... ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం 130 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం ఒక్కో జిల్లాకు రెండు టాస్క్ఫోర్స్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మార్చి 4 నుంచి విజయవాడలో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వస్తుందని చెప్పిన మంత్రి ఇక్కడి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్ష నిర్వహణను సమీక్షించడం జరుగుతుందని వివరించారు.