కలాంకు నివాళి: తనను పరామర్శించారన్న బాబు, నివాళికీ మైకు ఇవ్వలేదన్న జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాంకు నివాళులర్పించింది. సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో ఉదయం కలాంకు సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కలాం దేశం కోసం చేసిన కృషిని కొనియాడారు.
కలాం మృతి భారతదేశాన్ని శోకసముద్రంలో ముంచిందని అన్నారు. మంచి వ్యక్తి, శాస్త్రవేత్త అయిన కలాంను తామే ముందుండి రాష్ట్రపతిని చేశామన్నారు. కలాం రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కలాం ఎంతో కృషి చేశారని అన్నారు.
పేద కుటుంబంలో పుట్టిన ఆయన అనునిత్యం పని చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. చనిపోయిన తర్వాత కూడా హాలీడే ఇవ్వకండని కలాం ముందే చెప్పారని తెలిపారు. అవసరమైతే 2గంటలు ఎక్కువ పని చేయాలని అన్నారని, అందుకే తమ ప్రభుత్వం కలాం మృతి చెందిన రోజును సెలవుగా ప్రకటించలేదని చెప్పారు.

కలాం అంత్యక్రియలకు హాజరైనట్లు తెలిపారు. కలాం జీవితం మనకు స్ఫూర్తి దాయకమని చెప్పారు. ఒంగోలులో ఏర్పాటు చేసే ట్రిపుల్ ఐటికి కలాం పేరు పెడుతున్నట్లు చెప్పారు. మెరిట్ విద్యార్థులికచ్చే పురస్కారాలకు కలాం పేరు పెట్టనున్నట్లు తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో కలాం విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
‘వింగ్స్ ఆఫ్ ఫైర్' పుస్తకంతో కలాం యువతలో స్ఫూర్తి నింపారని సిఎం చంద్రబాబు అన్నారు.
అలిపిరిలో తనపై దాడి జరిగినప్పుడు ప్రొటోకాల్ పక్కనపెట్టి కలాం.. తన దగ్గరకు వచ్చి పరామర్శించారని గుర్తు చేసుకున్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడతారని స్పీకర్ చెప్పగా.. ఆయనకు మైకు రాలేదు. కొద్ది క్షణాల తర్వాత మైకు రావడంతో జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతకు శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మైకు ఇవ్వలేని పరిస్థితి అసెంబ్లీలో ఉందని అన్నారు. గొప్ప మేనేజ్ మెంట్ అని ఎద్దేవా చేశారు.
భారత మాత ముద్దు బిడ్డ కలాం అని వైయస్ జగన్ అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి వరకు ఎదిగారని అన్నారు. రాజకీయ నేతకలు కలాం ఒక రోల్ మోడల్ అని జగన్ చెప్పారు.84ఏళ్ల వయస్సులోనూ కలాం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని అన్నారు. పార్టీ తరపు నుంచి కలాం మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
ఏపి మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ.. కలాం మృతి భారతదేశానికి తీరని లోటని అన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధే ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చిందని తెలిపారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్నలాంటి అత్యున్నత పురస్కరాలను అందుకున్నారని చెప్పారు. ప్రజా రాష్ట్రపతిగా కలాం గుర్తింపు పొందారని, ఆయన శాఖాహారి అని, నైతిక విలువలు కలిగిన వ్యక్తని కలాంను కొనియాడారు.
భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. మేలిమి భారతరత్నం అని అన్నారు. స్వామివివేకానంద, మహాత్మా గాంధీ, తర్వాత కలాం దేశానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. పొఖ్రాన్ పరీక్ష చేసి అగ్ర దేశాల సరసన భారత్ను చేర్చారని అన్నారు. మిసైల్ మ్యాన్ ఇఫ్ ఇండియాగా గుర్తింపు పొందారని చెప్పారు.
అనంతరం పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంతాప తీర్మానం సిఎం చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 28మంది చనిపోవడం పట్ల సిఎం విచారం వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు చేసినా ఈ ఘటన జరగడం బాధ కలిగించిందని అన్నారు.












Click it and Unblock the Notifications