చంద్రబాబు, జగన్ చూసుకోలేనివిధంగా..: శోభా పేరేది?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చిన్నదిగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఒకరికి ఒకరు కనిపించని విధంగా సీట్లు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎపి అసెంబ్లీని పరిశీలించారు. ఎపి అసెంబ్లీ చిన్నదిగా ఉందని, సిఎం, ప్రతిపక్ష నేత కనిపించని విధంగా సీట్లు ఉన్నాయన్నారు.
కాగా, తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం చెప్పారు. తమకు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారన్నారు. ప్రధాన ప్రతిపక్షం అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనేలా చేస్తామన్నారు.

అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించే వారి లిస్టులో తంగిరాల ప్రభాకర్ పేరుందని కానీ, శోభా నాగిరెడ్డి పేరును చేర్చక పోవడం సరికాదన్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. దివంగత ఎమ్మెల్యేలకు నివాళులు అర్పించాల్సి ఉందని, చంద్రబాబు ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించడం లేదన్నారు.
తొందరపడొద్దు!
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తొందర పడవద్దని వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగంలో ఎపి ప్రభుత్వం ఏం చెబుతుందో వేచిచూద్దామని, ఎవరు తొందరపడి విమర్శలు చేయవద్దని సూచించారట.












Click it and Unblock the Notifications