సూటిగా అడుగుతున్నా, ఇదేమిటి: జగన్ ఆగ్రహం
హైదరాబాద్: పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యధేచ్ఛగా అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ తిరిగి ప్రారంభమైన తర్వాత ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశఆరు. టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఒక శాసనసభ్యుడు తన ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని ఆయన విమర్శించారు. బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లు తప్పు మాట్లాడుతుంటే, మీరు అనుమతిస్తునే ఉన్నారని, ఇదే కేసుకు సంబంధించి తాను సూటిగా అడుగుతున్నానని జగన్ స్పీకర్ను ఉద్దేశించి అన్నారు.
ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని - అధ్యక్ష స్థానం మీద ఆరోపణలు చేస్తున్నారని, అది కాదని అన్నారు. శాంతిభద్రతలపై చర్చలో వాళ్లకు సమయం ఇచ్చామని, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా చెప్పుకోవాలని అన్నారు. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తే స్పీకర్ మీదే ఆరోపణలు చేస్తున్నారని ఆయన పదే పదే అన్నారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అవకాశం ఇచ్చామని అన్నారు. తాను నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నట్లు స్పీకర్ చెప్పుకున్నారు.
ఆ తర్వాత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ - ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడాలని, స్పీకర్ మీద ఆరోపణలు చేయడం సరి కాదని, సభా మర్యాదలు పాటించాలని, స్పీకర్ అనుమతించడం వల్లనే బుచ్చయ్య చౌదరి మాట్లాడారని వివరించారు. ఈ స్థితిలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు నేరుగా ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో అధికార పార్టీ సభ్యుల తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ - శాసనసభను ఇడుపులపాయ, లోటస్ పాండ్ అనుకుని సొంత పాలన చేస్తున్నారని అంటూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నేత ఈ ముగ్గురు కూడా ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలని అన్నారు.