సభా పర్వం .. హెరిటేజ్ షాపుల్లోనే ఉల్లి ధర రూ.200... ఉల్లి ధరలపై చంద్రబాబుకు జగన్ పంచ్
Recommended Video
దేశంలో ప్రస్తుతం ఉల్లి సంక్షోభం కొనసాగుతుంది. అటు లోక్సభలోనూ, ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అసెంబ్లీలోనూ ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఉల్లిపై లొల్లి కొనసాగింది.

ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే దుర్మార్గం అన్న చంద్రబాబు
నేడు అసెంబ్లీ సమావేశాలకు ఉల్లి దండలతో నిరసన తెలియజేస్తూ టీడీపీ అసెంబ్లీ లోకి వచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఉల్లి ధరలను నియంత్రించడంలో తీవ్రంగా విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులపై మోయలేని భారంగా మారాయని అన్నారు. ఉల్లి కేజీ రూ. 200 అమ్ముతుందంటే ఎంత దుర్మార్గమో ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లోనే ఉల్లి 200 అన్న సీఎం జగన్
అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పంచ్ ఇచ్చారు. ఉల్లి ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన అసెంబ్లీలో స్పందించారు. అసెంబ్లీలో ఉల్లిధరల పై చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కి సంబంధించిన హెరిటేజ్ షాపులలో ఉల్లిపాయలు రెండు వందల రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారని రివర్స్ అటాక్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతులకు గిట్టుబాటు లేదన్న జగన్
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేక ఉల్లిని రైతులు పొలాల్లోనే వదిలేశారు అనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయని అయినప్పటికీ దేశంలో కిలో ఉల్లిని కేవలం రూ. 25కే అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి జగన్ ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను తెలిపారు.

ప్రత్యామ్నాయంగా సబ్సిడీకి ఉల్లి అందిస్తున్నామన్న ఏపీ సీఎం
ఇప్పుడు ఉల్లి మంచి ధరకు అమ్ముడుపోతుండటంతో రైతులకు లాభాలు వస్తున్నాయని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఉల్లి ఎక్కడ దొరుకుతున్నా కొంటున్నామని, సబ్సిడీపై ప్రజలకు తక్కువ ధరకే అందేలా చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తానికి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ ఉల్లి ధరల పెరుగుదలపై, ప్రతిపక్షాల వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications