కేంద్రం తీరుపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం: ఆంధ్రుడిగా పుడితే.. బాబు, విష్ణు ధీటైన కౌంటర్
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై అసెంబ్లీలో బుధవారం తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు, సీఎం చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది.
బాబ్లీ ప్రాజెక్టు కేసు, అరెస్ట్ వారెంట్: కోర్టుకు హాజరుపై చంద్రబాబు కీలక నిర్ణయం
చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగేళ్లు అనేక ప్రయత్నాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. తాను 29సార్లు ఢిల్లీ వెళ్లానని, కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఎందుకు నెరవేర్చదని ఏపీ శాసన సభ ప్రశ్నిస్తోందన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చాలని శాసన సభ డిమాండ్ చేస్తోందన్నారు.
కేంద్రం 90 శాతం హామీలను నెరవేర్చిందని బీజేపీ నేతలు ఎలా చెబుతున్నారని అడిగారు. దీనిపై విచారణ కమిటీని వేసేందుకు సిద్ధమని చెప్పారు. బీజేపీ నేతలకు, బ్రిటిష్ వారికి తేడా లేదన్నారు. మీరు ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలని ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. నేను కేంద్రంపై పోరాటం చేస్తున్నానని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
విష్ణు కుమార్ రాజు కౌంటర్
ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాలు రాలేదని అశోక్ గజపతి రాజు అంటున్నారని, కానీ కేంద్రమంత్రిగా ఇటీవలి వరకు ఎవరున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. బీజేపీ తమను అనుసరిస్తోందని చెబుతున్నారని, కానీ తాము సభకు వచ్చామని, కానీ వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీని వైసీపీ ఫాలో అవడం లేదని, అవన్నీ రూమర్లే అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుందంటే నేను చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. ముందు తాను ఆంధ్రుడిని అని, ఆ తర్వాత పార్టీ అన్నారు. ఆత్మగౌరవం కూడా అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ముఖ్యమంత్రే చెప్పారని గుర్తు చేశారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. హోదా ఇవ్వవద్దని ఎవరు చెప్పారని నిలదీశారు. దెబ్బతిన్న వ్యక్తిపై మరో దెబ్బ కొట్టకూడదన్నారు. జగన్కు బీజేపీ అంటే భయమని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగిందని, ఈ గడ్డపై ఆంధ్రుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి తన పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. తాను అడ్డంగా బుకాయించే వ్యక్తిని కాదని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ తాము తీసుకు వస్తామని చెప్పారు. ఆయన మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుకున్నారు.