YSRCP: ఆత్మకూరు ఉప ఎన్నిక తర్వాత ఏ క్షణమైనా AP అసెంబ్లీ రద్దు??
జూన్ నెలాఖరులో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. భారీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని వైఎస్సార్సీపీ నిలబెట్టబోతోంది. ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా? లేదంటే ఏ పార్టీ అయినా పోటీలో నిలబడుతుందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏమీ చెప్పని తెలుగుదేశం, జనసేన
తెలుగుదేశం, జనసేన ఇంతవరకు ఏమీ చెప్పకపోయినప్పటికీ భారతీయ జనతాపార్టీ మాత్రం ఆత్మకూరులో పోటీచేయడానికి ఉవ్విళ్లూరు తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా ఆయా బహిరంగసభల్లో జగనన్న సామాజిక న్యాయం చేస్తారు.. మళ్లీ మీరంతా జగన్కే ఓటేయాలంటూ కోరుతున్నారు. వీరు అలా కోరడమే రాజకీయ విశ్లేషకులను పునరాలోచనలో పడేసింది.

ప్రజల దృష్టి మళ్లించడానికి బస్సు యాత్ర!
మహానాడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఈ యాత్రను ఉపయోగించవచ్చు. . అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులంతా చేస్తున్న ఈ యాత్రలో జగన్కే మళ్లీ ఓటేయాలంటూ పదే పదే కోరడాన్ని బట్టి జగన్ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన అనేది స్పష్టమైందని భావిస్తున్నారు. అలాగే అది ఎప్పుడనేది కూడా స్పష్టత వచ్చిందంటున్నారు.

ఆత్మకూరు తర్వాత రద్దు చేయొచ్చు?
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి వైసీపీకి ఇది ఒక అవకాశం లాంటిదంటున్నారు. ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ వ్యతిరేకత పెరగకుండా ఉండటానికి సాధ్యమైంతన త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందంటున్నారు.

నవంబరులో రద్దుచేస్తే ఎలా ఉంటుంది?
నవంబరులో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీతో అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుందని, వారికి కూడా ఒక మాట చెప్పి అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆ తర్వాత బీజేపీ సహకారం కోరతారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఐదు సంవత్సరాలు పరిపాలించే దమ్ము వైసీపీకి లేదని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతోందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మకూరు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చన్నది మాత్రం స్పష్టమవుతోంది. పార్టీలన్నీ సిద్ధంగా ఉండటమే తరువాయి..!!












Click it and Unblock the Notifications