జనసేనతో ఏపీ బీజేపీ పొత్తు కటీఫ్.. భీమవరంలో బీజేపీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండడంతో జనసేన పార్టీతో పొత్తు తెంచుకోవాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది . ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ, ఏపీలో పొత్తులతో లాభం లేదని, జనసేనతో పొత్తు కటీఫ్ చేసుకోవాలని, సొంతంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసి, బలపడాలన్న భావనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోని ఏపీలో బిజెపి, జనసేన పొత్తు తెగ తెంపులు చేసుకోబోతున్నారని చర్చ జరుగుతుంది.

పొత్తులతో నష్టపోయాం అన్న ఆలోచనలో బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల వల్ల చాలా నష్టపోయామని బిజెపి భావిస్తున్న పరిస్థితి ఉంది. జనసేన తో పొత్తు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి పనిచేయకపోవడం, బిజెపి మైనర్ భాగస్వామిగా ఉండాల్సి రావడం వంటి పరిణామాలు జాతీయ పార్టీ అయిన బిజెపికి ఇబ్బందిగా మారాయి. ముఖ్యమంత్రిని చేస్తామని ఇతర పార్టీ నేతలను బతిమిలాడాల్సిన అవసరం ఏముంది అన్న అభిప్రాయం బిజెపి అధిష్టానం లో వ్యక్తం అవుతుంది. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యతను ఇచ్చినా ఆయన బీజేపీని పట్టించుకోవటం లేదన్న చర్చ జరుగుతుంది.

ఏపీలో పొత్తులే వద్దని బీజేపీ అధిష్టానం నిర్ణయం?
ఏపీలో పొత్తులతో కాకుండా సింగిల్ గానే ముందుకు వెళ్లాలని బిజెపి డిసైడ్ అయినట్టుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇక అధిష్టానం మాటను సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించినప్పటికీ, బిజెపి నేతల్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన తో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేయకూడదని నిర్ణయం తీసుకుంది. టిడిపితో పొత్తుకు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్టు రాష్ట్ర నాయకత్వం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇక ఏపీలో పొత్తులే వద్దని బిజెపి అధినాయకత్వం డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతుంది

రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో కీలక నిర్ణయాలు?
గతంలో తెలుగుదేశం పార్టీతో పలుమార్లు పొత్తు పెట్టుకోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేదు అన్న అభిప్రాయం కూడా జాతీయ నాయకత్వంలో ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈనెల 23, 24వ తేదీలలో భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో రాష్ట్రంలో బిజెపి భవిష్యత్తు కార్యాచరణ పై పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వి మురళీధరన్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం పై దృష్టి సారించాలంటూ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

వచ్చే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్
మొత్తంగా భీమవరంలో నిర్వహించే ఏపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ చేయనున్నారు. ఈ మేరకు అనేక కీలక నిర్ణయాలను కూడా తీసుకోనున్నారని పార్టీ వర్గాలలో జోరుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. మరి భీమవరంలో జరగనున్న సమావేశాలలో బీజేపీ జాతీయ నాయకత్వం దిశా నిర్దేశం ఏం చెయ్యనుంది.. పొత్తులపై విధానం ఏంటి ? అన్న దానిపై ఏపీ రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications