చంద్రబాబును అడ్డుకోవడం సరికాదు-కుప్పం పరిణామాల్ని ఖండించిన సోము వీర్రాజు..
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు కుప్పం టూర్ ఇవాళ ఉద్రిక్తతలకు దారి తీసింది. కుప్పంలోని మూడు మండలాల్లో పర్యటన కోసం చంద్రబాబు అనుమతి కోరినా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు అనుమతించలేదు. దీంతో చంద్రబాబు పర్యటన ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు.
ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న క్రమంలో పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. స్థానిక శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబును ఆంక్షల పేరుతో అడ్డుకోవడం ఏ విధంగానూ సరికాదని సోము తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హర్షించే విధంగా వారు వ్యవరించాలని అలా కాకుండా దురుద్దేశంతో వ్యవహరించటం మంచిది కాదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
2018లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా తిరుమల వస్తే పోలీసుల్ని, టీడీపీ కార్యకర్తలని పెట్టి ఆయన కారుపై రాళ్లు కర్రలతో దాడి చేయించారని అప్పటి ఘటనను సోము గుర్తుచేసుకున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు రాకుండా సభలు సక్రమంగా జరగకుండా గత చంద్రబాబు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి, నిరసన కార్యక్రమాలు, నల్ల బెలూన్లు జెండాలు హోర్డింగులు పెట్టిందన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వ్యవహరించడం మంచిది కాదని సోము వీర్రాజు హితవు పలికారు.
నాటి టీడీపీ- నేటి వైసీపీ రెండూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలేనని, ఈ రెండు పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వరని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఇలాంటి అంశాలపై ఈ రెండు పార్టీల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. చివరిగా ఇవాళ కుప్పంలో చోటు చేసుకున్న ఘటనల్ని ఆయన ఖండించారు.