చంద్రబాబు హయాంలో తీసుకున్న ఆ కీలక నిర్ణయాలకూ జగన్దే బాధ్యతా?
అమరావతి: ఏపీలో పరిశ్రమలు, వాటికి కేటాయించిన భూములపై భారతీయ జనత పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు గళం ఎత్తారు. ఇప్పటివరకు చోటు చేసుకున్న భూముల కేటాయింపుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని, వారి బెదిరింపుల వల్ల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోతోన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్కు లేఖ..
ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్ జగన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో పరిశ్రమను నెలకొల్పడానికి వచ్చిన జాకీ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందంటూ సోము వీర్రాజు డిమాండ్ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్న సొంత పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నిలదీశారు. దీనిపై వైఎస్ జగన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందనీ అన్నారు.

శ్వేతపత్రానికి డిమాండ్..
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఇప్పటివరకు ఎన్ని భూములు ఇచ్చారు? అందులో వినియోగంలో ఉన్నవి ఎన్ని? నిరుపయోగంగా ఉన్నవి ఎన్ని?, పారిశ్రామికవేత్తలు ఎన్ని పరిశ్రమలు స్థాపించారు?, ఎంతమందికి ఉపాధిని కల్పించారనే ప్రశ్నలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. భూములను కేటాయించిన తరువాత పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు కాలేదనే విషయంపై ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా? ఆ విషయాలను ప్రజలకు ఎందుకు వివరించట్లేదని విమర్శించారు.

ఎనిమిదిన్నరేళ్ల కాలంలో..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న భూముల కేటాయింపుపైనా జగన్ ప్రభుత్వమే స్పందించేలా.. విభజన అనంతరం తొలి అయిదు సంవత్సరాల కాలాన్ని కూడా కలుపుకొన్నారు. మొత్తంగా విభజన అనంతరం ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో జరిగిన భూ కేటాయింపుల వివరాలు వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

కబ్జాలకు పాల్పడుతున్నారు..
పరిశ్రమలకు కేటాయించిన భూములు చాలావరకు కబ్జాలకు గురైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని సోము వీర్రాజు చెప్పారు. అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడినట్లు వార్తలు వస్తోన్నాయని, ఈ కారణం వల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అనుమానాలపై వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అన్నారు.

కేంద్రం కారిడార్..
పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కారిడార్ను ఏర్పాటు చేసిందని, దీనికి అనుగుణంగా సింగిల్ విండో విధానంలో వాటికి అనుమతులను మంజూరు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినప్పుడే విభజనాంధ్రప్రదేశ్కు మోక్షం కలుగుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

అభివృద్ధికి అడ్డు..
కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భూముల కేటాయింపు అనేది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఆయా కాంట్రాక్టర్లను బెదిరించడం, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తోన్నట్లు వస్తోన్న వార్తలు.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతోందనీ ఆరోపించారాయన.












Click it and Unblock the Notifications