మూడు కాదు.. ఒకటే రాజధాని.. అధికారం ఇస్తే నిర్మించి చూపిస్తాం: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటూ.. సీఎం జగన్ ఫోటోలకు పోజులు ఇస్తున్నారని ఆరోపించారు. సమస్యలపై జనం ప్రశ్నిస్తే దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
Recommended Video

మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు సోము వీర్రాజు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఉండవు.. రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో నాడు చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేస్తే.. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. కర్నూలులో పర్యటించిన సోము వీర్రాజు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

ప్రజలను బెదిరిస్తున్న వైసీపీ నేతలు
వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో మసీదులు, చర్చీలకు నిధులను కేటాయిస్తోందన్నారు. మౌజమ్, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం మతతత్వాన్ని ప్రోత్సహించడం కాదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలను భయపెడితే ఎంతో కాలం అధికారంలో ఉండరని హెచ్చరించారు. వైసీపీకి ఓటు వేయకపోతే .. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లతో ప్రజలను బెదిరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 22 కర్నూలులో ప్రజా నిరసన సభ
సీఎం జగన్పై తిరుగుబావుటా వారి సొంత పార్టీ నుంచే మొదలయిందని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు . ఆత్మకూరు సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న కారణంతో అరెస్టు చేసిన బిజెపి నంద్యాల పార్లమెంటు జిల్లా కోశాధికారి సజ్జన్ సింగ్ పురోహిత్ ఇంటికి సోము వీర్రాజు వెళ్ళారు. వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇలాంటి అన్యాయాలను బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ దాడులు, అరెస్టులను నిరసిస్తూ ఈనెల 22 కర్నూలులో ప్రజా నిరసన సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications