అమరావతిపై బీజేపీ రెండు కళ్ల సిద్ధాంతం.. చంద్రబాబు అనుభవాలు తప్పవా ?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారుతో తమ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాల దృష్ట్యా రాష్ట్రంలో కీలక అంశాలపై ఎలాంటి వైఖరి అవలంబించాలనే అస్పష్టత బీజేపీని వీడటం లేదు. తాజాగా మూడు రాజధానుల విషయంలోనూ ఇదే గందరగోళం. ముందుగా రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశమని పదేపదే చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ఏపీ బీజేపీ అమరావతిని రాజధానిగా చేయాలని రాజకీయ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతికి అనుకూలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలకు శుభదినం.. అజ్ఞాతవాసికి దుర్దినం.. పవన్ను టార్గెట్ చేసిన వైసీపీ...
మూడు రాజధానులపై గందరగోళం..
ఏపీలో నిన్న మొన్నటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ మంచో చెడో అమరావతికి మద్దతుగా గట్టిగా మాట్లాడేవారు. పార్టీలో మిగిలిన నేతల నుంచి సహకారం ఉన్నా లేకున్నా కన్నా మాత్రం అమరావతిని కేంద్రం గుర్తించిందని, కేంద్రంతో సంబంధం లేకుండా వైసీపీ సర్కారు రాజధానులపై ముందుకెళ్లలేదని చెప్పేవారు. కానీ తాజాగా ఆయన స్ధానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుతో పాటు పార్టీ కీలక నేతగా ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న సునీల్ దియోధర్ మాత్రం రాజధాని కేంద్రం పరిధిలో లేని అంశమని చెప్పేవారు. కానీ తాజాగా వీరు ప్లేటు ఫిరాయించేశారు.
అమరావతి ముద్దు- కండిషన్స్ అప్లై..
ఎప్పుడైతే గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులపై సంతకం పెట్టారని తెలిసిందో అప్పటి నుంచి ఏపీ బీజేపీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిపై తాము గతంలోనే రాజకీయ తీర్మానం చేశామని, అప్పట్లో ప్రధాని హోదాలో మోడీ కూడా రాజధానికి శంఖుస్ధాపన చేశారని ఇప్పుడు బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దియోధర్ గుర్తు చేస్తున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ బాధ్యత నిర్వహిస్తుందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం అమరావతిపై వైఖరేంటో మాత్రం చెప్పడం లేదు.
కేంద్రం పరిధిలో లేదని చెప్పారుగా...
అదే సమయంలో రాష్ట్ర రాజధాని రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని గతంలో కేంద్ర హోంశాఖ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో ఎన్నో సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దియోధర్ పదే పదే ప్రస్తావించినట్లు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కేంద్ర పాత్ర ఉండబోదని వారే చెబుతున్నారు. కానీ అమరావతిపై మాత్రం తాము రాజకీయ తీర్మానం చేశామంటున్నారు. ఈ అస్పష్ట వైఖరి చూస్తుంటే అమరావతి ప్రాంతంలో కాస్తో కూస్తో పెరిగిన మైలేజ్ ను కాపాడుకునేందుకే ఈ రెండు కళ్ల సిద్దాంతాన్ని తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
రెండు కళ్ల సిద్ధాంతం ఫలిస్తుందా ?
గతంలో ఏపీ విభజన సందర్భంగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు పదే పదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రస్తావించేవారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని, రాష్ట్ర విభజన చేయాలని, కానీ ఏపీకి న్యాయం చేయాలని చెప్పేవారు. చివరికి ఏపీలో అధికారం సాధించుకున్నా తెలంగాణలో మాత్రం కనుమరుగై పోయారు. ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ కూడా ఇదే బాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రమంతా అభివృద్ధి ఫలాలు అందే విధంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెస్తుంటే దాన్ని సమర్ధిస్తున్నామనో, వ్యతిరేకిస్తున్నామనో చెప్పాల్సింది పోయి గతంలో అమరావతిపై రాజకీయ తీర్మానం చేశాం, కానీ రాజధాని మార్పులో కేంద్ర జోక్యం ఉండబోదంటూ రెండు పరస్పర వాదనలను తెరపైకి తీసుకొస్తోంది. అదే సమయంలో తాజాగా అమరావతే రాజధాని అంటూ పార్టీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ అవి ఆయన వ్యక్తిగతమంటూ క్లారిటీ ఇచ్చినా తమ అసలు వైఖరేంటో ఇప్పటికీ స్పష్టంగా చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.