నోట్ల రద్దుతో సహనం కోల్పోయా, నాకు రూ.6వేలే: మోడీకి ఏపీ బీజేపీ ఎమ్మెల్యే షాక్
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన ఏపీకి చెందిన బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బుధవారం నాడు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ చేసిన నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన ఏపీకి చెందిన బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బుధవారం నాడు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నోట్ల కొరతతో నేను కూడా సహనం కోల్పోయానని విష్ణు అన్నారు.
శశికళ ఎఫెక్ట్: పార్టీని వీడి కరుణానిధి వైపు వెళ్తున్నారు!
నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితమే తాను సహనం కోల్పోయానని విష్ణు కుమార్ రాజు తెలిపారు. నోట్ల రద్దుతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు.
తాను రూ.24 వేలు డ్రా చేసేందుకు వెళ్తే రూ.6 వేలు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు కూడగట్టిన బ్లాక్ మనీ వాళ్ల దగ్గర మాత్రం కొత్త కరెన్సీ విచ్చలవిడిగా దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నోట్ల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై కేంద్రంతో చర్చించాలన్నారు. కాగా, బీజేపీ నేత నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఇంకా మాట్లాడుతూ.. నాలా పన్నులు 9 నుంచి 2 శాతానికి తగ్గించాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు విష్ణు కుమార్ రాజు చెప్పారు.