ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు, కాపు నేస్తం, ఫీజు రీయింబర్స్మెంట్కు నిధుల కేటాయింపు
కాపు నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ విడిగా నియామకానికి సంబంధించి చట్ట సవరణకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యను కూడా పెంచింది. ఇదివరకు 19 మంది ఉండే సభ్యులను 29 మందికి పెంచేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు.
కాపు నేస్తానికి నిధులు
కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. కాపు నేస్తం పథకానికి సంబంధించి విధి విధానాలను కూడా మంత్రివర్గం సమావేశంలో చర్చకొచ్చింది. 10 ఎకరాల మగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారికి వర్తింపజేయాలని భావించినట్టు తెలిసింది. ట్రాక్టర్, ఆటో, ట్రాక్సీ నడుపుకునేవారికి కూడా జగన్ సర్కార్ మినహాయింపు ఇచ్చింది.
అర్హులకు పట్టాలు
అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ కార్డుల జారీపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.3400 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్మెంట్ విద్య దీవెన పేరుతో అందజేస్తారు. రూ.రెండున్నర లక్షల లోపు ఆదాయం ఉన్నవారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ఏడాదికి రెండుసార్లు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ కార్డులు కూడా..
అర్హులకు ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రూ.5 లక్షల లోపు సంపాదన ఉన్నవారికి ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని తెలియజేశారు. అయితే వీరిలో కొందరికీ బియ్యం అవసరం లేదని భావిస్తున్నామని చెప్పారు. వారిని మినహాయించి అర్హులకు రేషన్ అందజేస్తామని తెలిపారు. రైస్ కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు.
అర్హత ఉందా..?
గురువారం అమరావతిలో చంద్రబాబు పర్యటన గురించి తనదైన శైలిలో మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు అమరావతి రావొద్దు, తిరగకూడదనే కుసంస్కారం తమకు లేదన్నారు. చంద్రబాబుకు సీఎం, ప్రతిపక్ష నేతగా కాకుండా.. ఓ వ్యక్తిగా తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు.
మాటలేనా..?
ప్రపంచ ప్రమాణాలతో మీకు లే అవుట్ వేసి.. ప్లాట్లు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పినా మాట ఏమైందని నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఐదేళ్లు ఏం చేశారు... రాజధానిలో ఒక కారు వస్తే.. మరో కారు ఆగాల్సిన పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు.