దిశ చట్టం..కొత్త సందేహాలు: జగన్ ఎంత కసిగా చెప్పారంటే..: అసెంబ్లీ ఓకే చేసినా..గవర్నర్ ఆమోదించేనా..!
మహిళల భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ కొత్త చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడితే.... దానికి సంబంధించిన తిరుగులేని ఆధారాలు లభిస్తే... 21 రోజుల్లోనే ఉరి శిక్ష విధించాలని చట్ట సారాంశం. ఇదే సమయంలో ఉరి శిక్ష అని కాకుండా.. జైలు శిక్ష లేదా మరణ శిక్ష అని పెడితే బాగుంటుందేమో అనే అధికారులు సూచించినా..సీఎం జగన్ ససేమిరా అన్నారు. కేబినెట్ లో ఆమోదించిన ఈ చట్టం అసెంబ్లీలో బిల్లు రూపంలో రానుంది. అక్కడా సంఖ్య పరంగా బలం ఉండటంతో ఆమోదం పొందటం ఖాయమే. కానీ, అక్కడ నుండి గవర్నర్ వద్దకు వెళ్లిన తరువాత ఏం జరిగే అవకాశం ఉంది. నిపుణులు ఏం చెబుతున్నారు..ఇప్పుడు ఇదే అంశం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ తరహాలోనే..మనం కూడా
ఏపీ కేబినెట్ లో దిశ వ్యవహారంపైన కీలక చర్చ సాగింది. ఏపీలో మహిళా భద్రత కోసం కొత్తగా చట్టం చేయాలనే చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు.. దిశ ఘటన మన రాష్ట్రంలో జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే... మనపైనా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చేది. మనమూ తెలంగాణ సర్కారు తరహాలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్సాఫ్.. అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడితే.... దానికి సంబంధించిన తిరుగులేని ఆధారాలు లభిస్తే... 21 రోజుల్లోనే ఉరి శిక్ష.. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే రెండేళ్లు జైలు.. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి... నేర తీవ్రతను బట్టి ఇరవై ఏళ్ల వరకు జైలు..ఈ ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం - 2019. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఈ చట్టం పేరు వింటేనే భయపడిపోవాలంటూ
ఈ బిల్లుపైన చర్చ సమయంలో జగన్ జరిగిన ఘటన మీద చాలా బాధ..ఆవేదనతో మాట్లాడారు. అదే సమయంలో ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే ఏ రకంగా భావన కలగాలనే విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన రాష్ట్రంలో జరిగి ఉంటే.. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగేది... ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుందాం. ..భవిష్యత్లో ఆడపిల్లలపై చేయి వేయాలని, మానభంగం చేయాలన్న ఆలోచన వచ్చేందుకూ భయపడేంత కఠినమైన చట్టం తీసుకొద్దాం. ఈ చట్టం పేరు వింటేనే భయపడిపోవాలంటూ.. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

అధికారులు చెప్పినా..సీఎం నో
చట్టంలో నేరుగా ఉరి శిక్ష అని కాకుండా... జైలు శిక్ష లేదా మరణ శిక్ష అని పెడితే బాగుంటుందేమో అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటుగా న్యాయ శాఖ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. నేర తీవ్రతను బట్టి శిక్షను న్యాయమూర్తి నిర్ణయిస్తారని తెలిపారు. అయితే... అందుకు ముఖ్యమంత్రి జగన్ ససేమిరా అన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో విచారణ పూర్తి చేసేందుకు 4 నెలల సమయం ఇచ్చారు... అత్యాచార హంతకులకు శిక్ష పడుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది... నిర్ధారించదగ్గ ఆధారాలతో దొరికిన వారికి జైలు శిక్షతోనే సరిపెడితే ఎలా..వారిని ఉరి తీయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఈ బిల్లును ముందుగా అసెంబ్లీ ఆమోదించి చట్టం చేశాక.. గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కేబినెట్ తీర్మానించింది.

అసెంబ్లీలో ఓకే..గవర్నర్ ఆమోదించేనా..
ఏపీ కేబినెట్ ఆమోదించిన ఏపీ దిశ యాక్ట్ అమలు పైన ఇప్పుడు కొంత మంది నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తప్పు చేసే వారిలో భయం ఏర్పడే విధంగా చట్టం తేవటం సరైనదే అయినా..అది అమలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయనేది వారి అభిప్రాయం. బిల్లులో పొందుపర్చిన అంశాల పైన చట్ట పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును అసెంబ్లీలో అధికార పార్టీకి ఉన్న బలంతో ఆమోదం పొందటం సులువే. కానీ, విచారణ గడువును తగ్గించటంపైనే అటు గవర్నర్ తో పాటుగా ..ఇటు కేంద్రం సైతం అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో విచారణ సమయం మీదనే అభ్యంతరం వ్యక్తం అయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో..గవర్నర్ దీనిని యధాతధంగా ఆమోదిస్తారా లేక కేంద్రానికి నివేదిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications