కోనసీమ జిల్లా పేరు ఖరారు : అంబేద్కర్ పేరుతోనే కొనసాగింపు - మంత్రివర్గం ఆమోదం..!!
కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన కోనసీమ జిల్లా పేరు పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం పైన చర్చకు వచ్చింది. గత నెల 18వ తేదీన ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా.. కోనసీమ జిల్లాను అప్పటికే ఏర్పాటు చేసింది. అయితే, ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ పేరు పైన ప్రజల నుంచి అభ్యంతరాలు - సూచనల స్వీకరణకు నెల రోజుల సమయం కేటాయించింది.

ప్రాధమికంగా అంబేద్కర్ జిల్లాగా ప్రతిపాదన
ఈ సమయంలోనే అమలాపురం లో అంబేద్కర్ పేరుకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించారు. ఆ నిరసన గత నెల 24న అమలాపురం పెద్ద ఎత్తున అల్లర్లు.. విధ్వంసానికి కారణమైంది. మంత్రి విశ్వరూప్.. ఎమ్మెల్యే సతీష్ నివాసాలను తగుల బెట్టారు. పోలీసుల పైన రాళ్ల దాడి చేసారు. దీంతో..పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసారు. 15 రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ చేసారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న వారి విషయంలోనూ రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టీడీపీ - జనసేన శ్రేణులు ఈ విధ్వంసానికి దిగారని వైసీపీ ఆరోపించింది. అయితే, టీడీపీ - జనసేన నేతలు వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే ఈ విధ్వంసాలు చేయించందంటూ ఆరోపించారు.

అమలాపురంలో విధ్వంసం - ఆరోపణలు
ఇక, ఈ వ్యవహారంలో మొత్తంగా 217 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం జిల్లా పేరు పైన అభ్యంతరాల కోసం ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసింది. దీని పపైన వచ్చిన సూచనలు..సలహాలను జిల్లా కలెక్టర్ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని పైన ప్రభుత్వం జిల్లా పార్టీ నేతలతో పాటుగా..అధికారులతోనూ చర్చలు చేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో దీని పైన చర్చ చేసారు. చర్చ తరువాత అంబేద్కర్ పేరుతోనే జిల్లా పేరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

కేబినెట్ లో చర్చ - పేరు ఖరారు
జిల్లా పేరు మార్పు పై ప్రభుత్వం కోవటంతో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. 1300 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేసారు. మరోవైపు కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పన్నెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పైన కోర్టు విచారించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం తమ కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన అజెండా మేరకు ఈ అంశం పైన చర్చించి.. నిర్ణయం తీసుకుంది. దీంతో..ఇప్పుడు ఈ అంశం పైన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతాయనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications