ఏపీ కేబినెట్లో కొత్త సీఎంపై చర్చ: మహేందర్ రెడ్డి, కేసీఆర్ను అలా అంటావా!: ధర్మాన
హైదరాబాద్: కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులందరూ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చించుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
తెలుగు ప్రజలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు తప్పు చేశారని నమ్ముతున్నారని, అందుకే ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏపీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు అరెస్టు ఖాయం కావడంతో ప్రస్తుతం ఏపీ కేబినెట్లో కొత్త ముఖ్యమంత్రి పైన చర్చ సాగుతోందన్నారు. మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తప్పుకో: ధర్మాన
గవర్నర్ వ్యవస్థ పైన తనకు నమ్మకం లేదని చంద్రబాబు అంటున్నారని, అంత నమ్మకం లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని వైసీపీ నేత ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. ఏపీ కేబినెట్ను గవర్నర్ బర్తరఫ్ చేయాలన్నారు.
చంద్రబాబు తెలివితేటలు చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇన్నేళ్లు సీఎంగా ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉండి కూడా కేవలం ఓ కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణంతో ఆయన పైన విమర్శలు చేయడం సరికాదన్నారు.
గవర్నర్ మీద తమకు విశ్వాసం లేదని మంత్రులు రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు తదితరులు వ్యాఖ్యానించారని, వారిని బర్తరఫ్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ఓ వ్యక్తి మాత్రమేనని, అందువల్ల ఆయన ఓటుకు నోటు కేసులో సహకరించాలన్నారు.
తమకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. చంద్రబాబు చాలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద, శాసన వ్యవస్థధ మీద గౌరవం లేకుండా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఇప్పుడు ఎవరి హక్కులకు భంగం వాటిల్లిందని ప్రశ్నించారు.