జగన్ కేబినెట్ లోకి కొత్త మంత్రులు: విస్తరణ ముహూర్తం ఫిక్స్: ఇద్దరు ఔట్..ఇన్ ఎవరు..!
జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం 25 మందితో ఉన్న జగన్ కేబినెట్ లో త్వరలో మార్పులు జరగనున్నాయి. కొత్త వారికి అవకాశం దక్కనుంది. జగన్ తన కేబినెట్ ఎంపిక సమయంలో ఎవరి అంచనాలకు అందని విధంగా ఉప ముఖ్యమంత్రులు..సామాజిక సమీకరణాలను ఫాలో అయ్యారు. అదే సమయంలో మంత్రులుగా అవకాశం రాని వారికి అభయం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తన కేబినెట్ లోని మంత్రులు రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని..అందులో మెజార్టీ మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.
Recommended Video

అయితే, ఇప్పుడు మండలి రద్దు..ఇద్దరు మాజీలు అవుతుండ టంతో..వారి స్థానంలో ఇద్దరికి కొత్తగా తన కేబినెట్ లో అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ లో ఈ మేరకు కేబినెట్ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను సైతం పరిగణలోకి తీసుకొని మొత్తంగా మంత్రివర్గంలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. దీంతో..కొత్తగా కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ..అంచనాలు మొదలయ్యాయి.

ఇద్దరు మంత్రులు ఔట్..ఫలితాల తరువాత
ప్రస్తుతం జగన్ కేబినెట్ లో బీసీ వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ పేర్లు రాజ్యసభకు జగన్ ఖరారు చేశారు. వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. దీంతో..ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరికి అవకాశం కల్పించాల్సి ఉంది. అదే విధంగా..ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా మంత్రి పదవులు కొనసాగుతాయని..పార్టీ అభ్యర్ధులు ఓడితే సంబంధిత జిల్లా మంత్రులు పదవులు కోల్పోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
దీంతో..ఇప్పుడు ఖాళీ అవుతున్న రెండు కేబినెట్ బెర్తులతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. గతంలో వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో తమ సొంత నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల ఓటమి కారణంగా నాటి మంత్రులు మాగంటి బాబు..మారెప్ప మంత్రి పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ సైతం అదే తీరున వ్యవహరిస్తున్నారు.

ఏప్రిల్ లో విస్తరణకు నిర్ణయం..
ఈ నెల 27 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం..ఫలితాలు వెల్లడి కావటం పూర్తి కానుంది. 31వ తేదీ వరకు అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక, ఏప్రిల్ నుండి జగన్ సైతం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది సమయం పూర్తవుతుంది.
దీంతో..స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను సైతం పరిగణలోకి తీసుకొని జగన్ తన కేబినెట్ లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం మంత్రి పదవులు వీడుతున్న ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు కావటంతో..తిరిగి బీసీలతోనే ఆ రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. పిల్లి బోస్ ను బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. రాజకీయంగా తూర్పు గోదావరి కీలకం కావటంతో అదే జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన వారికి తిరిగి కేబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా మోపిదేవి సైతం బీసీ వర్గానికి చెందిన వారే కావటంతో..ఆయన స్థానం సైతం బీసీలతోనే భర్తీ చేయనున్నారు. అయితే, అదే సమయంలో ప్రాంతాలను..ఇప్పటి వరకు పరిపాలనా వ్యవహారాల్లో అవకాశం దక్కని బీసీ వర్గాల కు చెందిన వారిని జగన్ ఎంపిక చేస్తారనే అంచానలు మొదలయ్యాయి.

సమర్ధత..నివేదికల ఆధారంగా
ముఖ్యమంత్రి జగన్ తొలుత ప్రస్తుత కేబినెట్ రెండున్నారేళ్లు ఉంటుందని చెప్పినా..వచ్చే నెలలో మార్పులు తప్పేలా లేవు. ఇప్పటికే ప్రతీ మంత్రీ..ఎమ్మెల్యే పని తీరు పైన ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించు కున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే తమకు మంత్రి పదవులు ఖాయమని భావించిన అనేక మంది సీనియర్లకు నిరాశ మిగిలింది. ఇక, ఇప్పుడు తిరిగి విస్తరణ చర్చ ప్రారంభం కావటంతో వారంతా తిరిగి రేసులో నిలిచారు. నగరి ఎమ్మెల్యే రోజా..అంబటి రాంబాబు..కొలుసు పార్ధసారధి..జోగి రమేష్..బాలరాజు..కాకాని గోవర్ఱన్ రెడ్డి..భూమన కరుణాకరరెడ్డి.. వీరభద్రస్వామి..దాడిశెట్టి రాజా..చిర్ల జగ్గిరెడ్డి లాంటి వారు ఉన్నారు.

ప్రాంతీయ సామాజిక సమీకరణాలతోనే...
పూర్తిగా ప్రాంతీయ..సామాజిక సమీకరణాలతోనే జగన్ విస్తరణ చేసే అవకాశం ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ కొనసాగుతోంది. మంత్రుల్లో కొందరి పని తీరు పైన సీఎం పూర్తి స్థాయిలో సంతృప్తి కరంగా లేరని తెలుస్తోంది. చివరి నిమిషం వరకు తన మనసులో మాట బయట పెట్టకుండా అనూహ్యంగా నిర్ణయాలు ప్రకటించే జగన్..ఇప్పుడు తన కేబినెట్ విస్తరణలో మార్పులు..చేర్పుల పైనా అదే విధంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అయితే, కొందరు మంత్రుల శాఖలు మాత్రం మార్పు తప్పదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications