AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-అమరావతికి 44 వేల ఎకరాలు-ఇంకా ఇవే..!
ఏపీలోని అమరావతి సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలపై చర్చించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఇందులో అమరావతిలో చేపట్టబోయే రెండో విడత భూసేకరణకు ఆమోదంతో పాటు మొత్తం 42 నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇవాళ కేబినెట్లో అమరావతి రాజధాని కోసం రెండో విడతలో 44 వేల ఎకరాలు సేకరించాలని సీఆర్డీయే తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇందులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ప్రపంచ స్థాయి ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పేదలకు 5 వేల పింఛన్, రుణమాఫీ, ఉచిత వైద్య సదుపాయం, ఉచిత విద్య వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయన్నారు.

అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్స్, హెచ్వోడీ టవర్స్ కు బిడ్డింగ్ పొందిన కాంట్రాక్టర్లకు పనులు చేపట్టేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. సీఆర్డీఏలో 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఎకరానికి 50 లక్షల చొప్పున అమరావతిలో లా యూనివర్శిటీకి 55 ఎకరాల భూముల్ని 60 ఏళ్ల పాటు కేటాయించారు. కొత్తగా మరో 7 అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. భవన నిర్మాణ అనుమతుల్లో నిబంధనల్ని సరళీకృతం చేయాలని నిర్ణయించారు.
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో సెబ్ కార్ప్ ఎనర్జీ సంస్థకు విద్యుత్ ప్లాంట్ కోసం ఐదు ఎకరాల నాలుగు సెంట్లను కోటీ 13 లక్షల చెల్లింపుపై భూముల బదిలీ కోసం రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళంలో ఎస్ఏపీఎల్ పైపులైన్ నిర్మాణం, కొత్త భవనం కోసం ఎకరం 70 సెంట్ల భూమిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. గండికోటలో ఓబెరాయ్ రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాలు భూమి ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
పాలార్ నదిపై 17 చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం 53.55 కోట్ల రూపాయలతో పరిపాలనా ఆమోదం ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. అంతకు ముందే ఇక్కడే మరో నాలుగు చెక్ డ్యామ్ ల మరమ్మత్తుల కోసం రూ.10.24 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. విజయవాడలోని నీటి పారుదల మంత్రి కార్యాలయం భద్రతా ఏర్పాట్ల కోసం 49.5 లక్షలు ఖర్చుపెట్టేందుకు ఆమోదం లభించింది. పోలవరాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ 2027 కల్లా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై కేబినెట్ లో చర్చించారు. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని వాడుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. గండికోటలో అదానీ ఎనర్జీ ప్రాజెక్టు సామర్ధ్యం 1800 మెగావాట్లకు పెంచాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా మద్దెలచెరువులో 83 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపారు. కడపలోని కొండాపురంలో కొప్పోలు పవర్ ప్రాజెక్ట్ కూ అనుమతి ఇచ్చారు. అల్లూరి జిల్లాలో అదానీ ప్రాజెక్టు సామర్ధ్యం పెంపుకూ ఆమోదం ఇచ్చారు.
6492 మినీ అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో పనిచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను కూడా అప్ గ్రేడ్ చేస్తారు. అలాగే 4657 మంది కొత్త అయాల్ని కూడా నియమిస్తారు. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా ఎకరా 99 పైసలకే భూకేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 28546 కోట్ల విలువైన ప్రాజెక్టులపై ఎస్ఐపీబీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications