పీఆర్సీ పై పునరాలోచన - మంత్రులకు ఫైనల్ ఛాన్స్ : నేడు ఏపీ కేబినెట్ భేటీ..!!
ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఉవ్వెత్తున ప్రారంభించిన నిరసనలు.. వారి తాజా డిమాండ్లే ప్రధాన చర్చగా ఈ రోజున ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పీఆర్సీ పైన అనేక చర్చలు సాగినా.. ముఖ్యమంత్రితో భేటీల తరువాత ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించారు. అయితే, ఆ తరువాత జారీ చేసిన జీవోల్లో హెచ్ఆర్ఏ తగ్గిచంటం..సీసీఏ రద్దు వంటి నిర్ణయాలతో ఒక్క సారిగా ఉద్యోగు లు రిగలిపోయారు. వీరిని బుజ్జగించేందుకు సీఎస్ తో సహా ఏపీ ఆర్దిక - జీఏడీ అధికారులు మీడియా ముందుకొచ్చి మరోసారి ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించారు.
చర్చలకు సీనియర్ మంత్రులతో కమిటీ
ఈ పరిణామం ఉద్యోగ సంఘాలకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఆదాయ పరిస్థితి పైన అసత్యాలు చెబుతున్నారంటూ అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు. అనూహ్యంగా అందరూ కలిసి జేఏసీ ఏర్పాటు చేసారు. భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు ప్రకటించనున్నారు.
నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీ అంశం పైన ప్రభుత్వం పునరాలోచన చేస్తుందనే భావనలో కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. దీంతో..కేబినెట్ భేటీలో నిర్ణయాలను పరిశీలించి..ఆ వెంటనే తమ ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పీఆర్సీ పైన చెప్పిందే చేశామంటున్న ప్రభుత్వం
అయితే, సీనియర్ మంత్రులు -అధికారులతో కలిపి ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. మంత్రులకు మరో సారి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీ ఏంటి.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన మరోసారి మంత్రుల కు కేబినెట్ సమావేశంలో అధికారులు వివరించనున్నట్లు సమాచారం. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.
అయితే, ఎవరి పైనా కేసులు నమోదు చేయవద్దంటూ ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తోంది. ఒక, రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న కరోనా మూడో దశ కేసులు ..ప్రభుత్వ చర్యల పైన సీఎం దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. ఈ భేటీలో పలు ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సంక్షేమ క్యాలెండర్ - ఆర్డినెన్స్ లపైనా
ఈ ఏడాది నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న సంక్షేమ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. రాజకీయంగా కొంత మంది మంత్రులు ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా... పట్టించుకోవటం లేదని కొన్ని అంతర్గత సమావేశాల్లో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
ఈ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ వారికి ఫైనల్ ఛాన్స్ గా హెచ్చరికలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వచ్చే నెల 5వ తేదీ తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో పాటుగా నర్సాపురం నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు పదే పదే చెబుతున్నారు.
నర్సాపురం బై పోల్ వస్తుందా..సిద్దంగానే
అసలు రఘురామ వ్యవహారంలో ఢిల్లీలో - రాష్ట్రంలో ఏం జరుగుతోంది.... ఉప ఎన్నిక వస్తే ఏం చేయాలనే అంశం పైన సీఎం ఈ కేబినెట్ భేటీలో అధికారిక అజెండా పూర్తియిన తరువాత మంత్రులతో పొలిటికల్ చర్చలో భాగంగా కీలక దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. అయితే, ఉద్యోగులు సమ్మెకు సిద్దం అని చెబుతున్న సమయంలో... వారిని సమ్మె వైపు వెళ్లనీయకుండా వారితో చర్చలకు సీనియర్ మంత్రులతో కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీంతో.. ఈ రోజు జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకోనుండటంతో ఈ భేటీ పైన ఆసక్తి నెలకొని ఉంది.