ఏపీ క్యాబినెట్ భేటీ .. రాజధాని ప్లాన్ మార్పు అంశంతో పాటు కీలక అంశాల చర్చ
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని ప్లాన్ మార్పుకు సంబంధించిన అంశం కీలకంగా మంత్రివర్గం చర్చించనుంది. మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్న ఈ భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాల గురించి, పోలవరం నిర్మాణ పనుల గురించి, ఇక త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల గురించి చర్చించనున్నారు.

ఏపీ రాజధాని ప్లాన్ మార్పుపై క్యాబినెట్ భేటీలో చర్చ
ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న కేబినెట్ భేటీలో ప్రధానంగా అమరావతి సంబంధించి సింగపూర్ ప్లాన్ లో చేసిన మార్పుల పై చర్చ జరగనుంది. గతంలో చంద్రబాబుకు సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్లాన్ ను ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మార్చాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే సి ఆర్ డి ఏ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ప్లాన్లో మార్పులు చేసింది. ఇక దీనిపై నేడు చర్చ జరగనుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్లాన్ మార్పు చేసిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

నవరత్నాలు పథకాలు అమలుపై చర్చ
ఇక అంతే కాకుండా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు లో భాగంగా అమలవుతున్న పలు పథకాల విషయంలో కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది. కంటి వెలుగు రెండో దశ అమలు తీసుకోవాల్సిన చర్యలు,రైతు భరోసా పథకంలో లబ్ధిదారుల ఎంపిక,నిధుల కేటాయింపు,వాహన మిత్ర అమలు వంటి అంశాలను క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు.అంతేకాదు ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలన్నదానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

పోలవరం ప్రాజెక్ట్ పనులు పునఃప్రారంభం అంశం
ఆర్టీసీ విలీనం చెయ్యటం , ఆ తరువాత తీసుకోవాల్సిన చర్యలు , ఆరోగ్యశాఖ ప్రక్షాళన కు సంబంధించి సంస్కరణలపై సుజాత రావు కమిటీ నివేదికకు ఆమోదం వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం నవంబర్ 1 నుండి పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించడానికి కసరత్తులు చేస్తోంది. ఇక అందుకు అవసరమైన చర్యలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

విద్యుత్ పీపీఏలపై మంత్రి వర్గంలో చర్చించే అవకాశం
విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై క్యాబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటికే జగన్ కేంద్ర మంత్రులతో , ప్రధాని మోడీతో ఈ విషయంపై మాట్లాడినప్పటికీ విద్యుత్ ఒప్పందాల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇక ఈ విషయంలో సైతం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు సీఎం జగన్. మొత్తానికి ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications