ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. బాబు-లోకేశ్కు సీబీఐ ఉచ్చు.. మహిళలకు శుభవార్త.. 16 నుంచి అసెంబ్లీ..
ఇటీవలే ఏడాది పాలన పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా నెరవేర్చామని అంటూనే.. కొత్తగా మరెన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు కీలక అంశాల్లో కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. రెండో ఏడాదిలో ఆయన ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళతారనేది చర్చనీయాంశమైంది. దీనికి సమాధానాలుగా తాజా కేబినెట్ సమావేశం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలవడ్డాయి.
Recommended Video

3 రోజులు అసెంబ్లీ..
ఉండవల్లిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన గురువారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయ ఉద్యోగుల్లో 11 మందికి కరోనా సోకిన నేపథ్యంలో కేబినెట్ భేటీ వేదిక మారుస్తారని ప్రచారం జరిగినా, చివరికి సెక్రటేరియట్ లోనే సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని తిరిగి ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే, మహిళల కోసం కొత్త పథకం, కీలకమైన రామయపట్నం పోర్టు నిర్మాణం, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వెలికితీసే అంశాలపైనా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు మంత్రులందరూ భేటీకి హాజరయ్యారు.

మహిళలకు శుభవార్త..
రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఏపీ కేబినెట్ శుభవార్త తెలిపింది. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ మేరకు ‘‘వైఎస్సార్ చేయూత'' పథకానికి మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఒక్కొక్కరికి కు ఏటా రూ.18,750 చొప్పున.. ఐదేళ్లకుగానూ రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ పథకాన్ని సీఎం జగన్ ఆగష్టు 12న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల ఎంపిక దాదాపు పూర్తికావచ్చింది. అర్హులు ఎవరైనా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లిగానీ లేదా వాలంటీర్ల ద్వారా గానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు.

రామాయపట్నం పోర్టు కట్టుడే..
విభజన సమయంలో చట్టపరంగా ఏపీకి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచాలని, అదే సమయంలో ప్రాజెక్టుల పూర్తికి సొంతగానూ ముందుకెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రధానంగా రామాయపట్నం పోర్టుపై సీఎం లోతుగా చర్చలు చేశారు. కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే.. రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదు దశల్లో పూర్తిచేయాలని, మొదటి దశలో రూ. 4736 కోట్ల వ్యయానికి సంబంధించి ఆగస్టులోనే టెండర్లు పిలవాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి, డిస్కం, ట్రాన్స్కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ నిధులు ఖర్చు చేసేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

చంద్రబాబుకు సీబీఐ ఉచ్చు..
జగన్ ఏడాది పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. వైసీపీ సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసిన ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు దూకుడుకు కళ్లెం వేసే దిశగా ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గత టీడీపీ హయాంలో అమలైన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని మంత్రి మండలి డిసైడైంది. బాబు పథకాల్లో అక్రమాల పరిశీలన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. అలాగే, నాటి ఐటీ మంత్రిగా నారా లోకేశ్ నేతృత్వంలో నడిచిన ఫైబర్ నెట్ పథకంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ కీలక అంశాలను సేకరించింది. వీటి ఆధారంగా తండ్రీకొడుకులపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేబినెట్ నిర్ణయించింది.

మజ్జిగకు రూ.40 కోట్లు..
చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా వంటి స్కీముల ద్వారా సుమారు రూ. 158 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. హెరిటెజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ద్వారా ఏడాదికి రూ. 40 కోట్ల మేర ఖర్చు పెట్టారని కమిటీ దర్యాప్తులో తేలగా.. సదరు సరఫరా, ఖర్చులపై సీబీఐతోనే ఎంక్వైరీ చేయిస్తే మంచిదని కమిటీ సూచించింది. ఆ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

లోకేశ్పై వల..
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఫైబర్ నెట్ అంశం తరచూ ప్రస్తావనకు వస్తుండటం, చంద్రబాబు హయాంలో ఐటీ మంత్రిగా లోకేశ్ సారధ్యంలో ఈ మేకు భారీ కుంభకోణం జరిగిందనే చర్చ వినిపిస్తుండటం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఎట్టకేలకు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ గురువారం కేబినెట్ తీర్మానం చేసింది. ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా వేమూరి హరి ప్రసాద్ అనే వ్యక్తికి ఫైబర్ నెట్ హెడ్ గా నియమించారని, అర్హత కలిగిన కంపెనీలను పక్కకు నెట్టేసి.. వేమూరికి చెందిన కంపెనీకి ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టారని, తద్వారా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ. 700 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తులో తేలింది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లల్లో భారీ కుంభకోణం జరిగిందని కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications