ఏపీ క్యాబినెట్ భేటీ నేడే: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఫైనల్ డెసిషన్..కీలకాంశాలు ఇవే !!
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది.ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం కేబినెట్ తెలపనుంది . ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటుగా, ముసాయిదా బిల్లులపై ఆమోదం తెలియజేయనున్నారు . అంతేకాకుండా గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మరికొన్ని హామీలకు కేబినెట్లో ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తుంది.
'జగనన్న చేదోడు'కు సెలబ్రిటీల ప్రశంసలు- జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా ? వద్దా ? నేడు భేటీలో నిర్ణయం
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయానికివస్తే ఈసారి బడ్జెట్ సమావేశాలను కరోనావైరస్ కారణంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా ? వద్దా ? అన్నదానిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కరోనా కారణంగా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తీసుకొచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా పూర్తిస్థాయి బడ్జెట్ పై కూడా ఆర్డినెన్స్ తేవచ్చు అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా ? లేక ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను తీసుకురావచ్చా అని నేడు కేబినెట్ భేటీలో మంత్రులతో కీలకంగా చర్చించనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే 18న బడ్జెట్
ఒకవేళ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 16 నుండి ప్రారంభించాలని భావిస్తోంది. బీఏసీ సమావేశం తర్వాత బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. 16వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు .ఇక 18న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇలా కాకుంటే కూడా బడ్జెట్ ను ప్రవేశ పెట్టవచ్చని తెలుస్తుంది. మరి నేడు కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా ఉంది.
పలు ముసాయిదా బిల్లులకు మంత్రివర్గ ఆమోదం
ఇక ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చే అంశాలను చూస్తే జీఎస్టీ ఎగవేతను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ను ఏర్పాటు చేయడం, అలాగే అక్రమ మద్యం, ఇసుక రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందించే వైయస్సార్ చేయూత పథకాన్ని కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలపడం చేయనున్నారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
Recommended Video
వైద్య పోస్టుల భర్తీ , పలు చట్టాల సవరణలు , తెలుగు అకాడమీపై కీలక నిర్ణయాలు
ఇక అంతే కాదు వైద్య పోస్టుల భర్తీ, తెలుగు అకాడమీపై నిర్ణయాలు, జీఎస్టీ చట్టంలో సవరణలు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ చట్టంలో సవరణలు,గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఇక పోలీస్ శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులను కూడా మంజూరు చేయనున్నారు. విజయనగరం జిల్లా కురుపాం లో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు తో పాటుగా, మరో మూడు కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు పై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగు అకాడమీ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గ సమావేశం.