ఏపీ కేబినెట్లో కేసీఆర్ అంశం, ఐదు గంటలు భేటీ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సోమవారం నాడు ఐదు గంటల పాటు సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.
అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జరిగిన చర్చల సారాంశం పైనా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారని సమాచరం. మున్సిపల్ కార్పొరోషన్ల ఏర్పాటు, నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం, మున్సిపాలిటీ గ్రేడ్లను ఆరు నుండి మూడుకు కుదించడం, దేవాలయ కమిటీల పాలకవర్గం గడువు ఏడాదికి తగ్గించడం, ఈ నెల 19వ తేదీ నుండి చెట్టు - మీరు కార్యక్రమం, కొత్త కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని.. తదితర నిర్ణయాలు తీసుకున్నారు.
అలాగే, ఏడు మిషన్ల అమలు తీరు పైన సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ కోత పైన కూడా చర్చించారు. కార్పోరేషన్గా ప్రతి జిల్లా కేంద్రాన్ని మార్చాలని నిర్ణయించారు. ప్రతి నెల గురువారం తలనీలాలను విక్రయించాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం అధికారుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రం నుండి ఏపీకి నిధులు వస్తాయని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. 15 రోజులకు ఒకసారి మంత్రులు సమీక్షించాలన్నారు. ఇసుక అమ్మకాల్లో ప్రజాప్రతినిధుల జోక్యం వద్దని, ఎర్రచందనం అమ్మకాలకు మరింత కృషి చేయాలని చెప్పారు.
కేబినెట్ వివరాలు చెప్పిన మంత్రి పల్లె
ఏపీ కేబినెట్ సమావేశం వివరాలను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సరైన పనికి సరైన అధికారిని నిర్ణయిస్తామని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వారంలో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని చెప్పారు. అన్ని రకాలుగా మనకు 5,742 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని చెప్పారు.
రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఈ నెల 19న నీరు - చెట్టు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని కరవురహితంగా మార్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. చెరువులు, చెక్ డ్యాంలు మరమ్మతు చేపిస్తామన్నారు. తాగునీరు కష్టాలు లేకుండా చూస్తామన్నారు. రాబోవు నాలుగైదు సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.