ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-విద్యార్ధులకు జగన్ బర్త్ డే కానుక- పెన్షన్లు రూ.2750కు పెంపు..
ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్ లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పేదలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను రూ.2500 నుంచి రూ.2750కు పెంచాలని నిర్ణయించారు. పెరిగిన పింఛన్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జిందాల్ స్టీల్ ను భాగస్వామిని చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పంపెడ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు కొత్త విధానాన్నీ ఆమోదించింది. టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీర్వో పోస్టు భర్తీకి జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణ చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు పట్టణాభివృద్ధి సంస్ధలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 1301 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు మున్సిపాలిటీలు, 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 8 మున్సిపాలిటీలు, 28 మండలాల్లో 349 గ్రామాలతో 7281 చదరపు కిలమీటర్ల పరిధిలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరొకవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది..