ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో జగన్ మార్క్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. ముహూర్తం ఫిక్స్!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను ఏప్రిల్ 11వ తేదీన చేపట్టనున్నట్టు వైసిపి వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు విశాఖ శారదా పీఠాధిపతి ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టుగా సమాచారం. రానున్న భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తుంది.

బలమైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడంతో పార్టీ నాయకులలో టెన్షన్ పెరిగింది. వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతోంది.ఏప్రిల్ 4న గుంటూరులోని నర్సరావుపేటలో వాలంటీర్లకు అభినందన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని, ఏప్రిల్ 4 తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బలమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీకి బలం చేకూర్చే నేతలకు మంత్రివర్గంలో స్థానం దక్కనుంది .

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 2019లో మంత్రులను రెండున్నరేళ్లకు మారుస్తానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ఉగాదికి 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారిగా సామాజిక తరగతులను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పును చేపట్టనున్నట్లు సమాచారం.

90 శాతం మంది మంత్రులకు పదవీ గండం..
మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న 90% మంది ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమ స్థానాలను కోల్పోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక మంత్రివర్గం నుంచి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తూ పదవులు కోల్పోతున్న వారికి జిల్లాలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తామని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని సీఎం జగన్ చెప్పారని సమాచారం.

కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కేది ఎవరికో?
ఇక తొలివిడతలో అవకాశం దక్కని చాలామంది ఈసారి జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆశావహులు తమకు అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ క్రమంలో కొత్తగా మంత్రివర్గంలో అవకాశం దక్కించుకునే వారు ఎవరనే దానిపై వైసిపి నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గం నుండి తమకు ఉద్వాసన తప్పదని చాలా మంది మంత్రులు ఆందోళనలో ఉన్నట్టుగా సమాచారం. తమ స్థానాలను కదల్చకుండా ఉండాలని వారు సైతం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

మంత్రి వర్గంలో స్థానం కోసం నానా తంటాలు పడుతున్న వైసీపీ నేతలు
ఇక మరోవైపు గతంలోనే మంత్రులుగా అవకాశం ఇస్తారని భావించిన చాలామంది ఈ సారి ఎలాగైనా మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. జగన్ ను ప్రసన్నం చేసుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఏదిఏమైనా మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర వ్యాప్త ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు చేసుకోబోతున్న మార్పులు వైసిపికి లాభం చేకూరుస్తాయా? లేదా? అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications